హుజురాబాద్‌లో ఉత్కంఠ.. RS ప్రవీణ్ కుమార్ మద్దుతు ఎవరికి.?

by  |
హుజురాబాద్‌లో ఉత్కంఠ.. RS ప్రవీణ్ కుమార్ మద్దుతు ఎవరికి.?
X

దిశ, హుజురాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కాక పుట్టిస్తున్న హుజురాబాద్ బై పోల్స్ విషయంలో ఆయన మద్దతు ఎటు వైపు ఉంటుంది.? సపరేట్‌గా ఏర్పర్చుకున్న ఆయన టీం ఎవరికి ప్రచారం చేయబోతోంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. బహుజనులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్న విజన్‌తో ముందుకు సాగిన మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్సీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారన్నదే ప్రధాన చర్చగా మారింది. సమాజంలోని దళితులు, బీసీల అభ్యున్నతే నినాదంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటి వరకు పార్టీ సమావేశాలకే పరిమితమయ్యారు.

అడపాదడపా హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి ప్రస్తావించినా సీరియస్‌గా మాత్రం దృష్టి పెట్టలేదు. ఆయన రాజీనామా చేసిన తరువాత హుజురాబాద్ నుండి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగినా ఆయన ఈ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఆ తరువాత బీఎస్పీలో చేరిన ప్రవీణ్ కుమార్ పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ గళమెత్తుతున్నారు తప్ప హుజురాబాద్ ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికి ఇచ్చే విషయంపై క్లారిటీ లేకుండా పోయిందనే చెప్పాలి. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ ఓటర్ల సంఖ్య గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంది.

గతంలో సోషల్ వెల్పేర్ గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ కుమార్ బహుజన విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు. కేవలం గురుకులాల్లో చేరిన విద్యార్థులను మాత్రమే తీర్చిదిద్దడం వరకే పరిమితం కాకుండా సమాజంలోని అణగారిన వర్గాల్లో చైతన్యం నింపేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రవీణ్ కుమార్ ప్రత్యేకంగా స్వేరోస్ పేరిట ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేశారు.

సుప్రీం స్వేరోగా ప్రవీణ్ కుమార్ క్షేత్ర స్థాయిలోకి సంస్థ కార్యకలాపాలు తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు. గురుకులాల కార్యదర్శిగా పని చేసినప్పుడు ఏర్పాటు చేసిన స్వేరోస్ సంస్థను బలోపేతం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ ఓ ప్రత్యేక టీం ఏర్పడింది. రాష్ట్రంలోని స్వేరోస్ సభ్యులు అందరూ కూడా ప్రవీణ్ కుమార్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ అవుతున్న క్రమంలోనే హుజురాబాద్‌లో ఎన్నికల వాతావరణం నెలకొంది. బీఎస్పీలో చేరిన ఆయన ఈ ఉప ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికి అన్నది ఇప్పటి వరకూ స్పష్టం చేయడం లేదు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం తటస్థంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

స్వేరోస్ ఎటు వైపో..

అయితే ఉప ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన స్వేరోస్ మద్దతు ఎవరికి ఇస్తారోనన్నదే ఆసక్తికరంగా మారింది. హుజురాబాద్ బై పోల్స్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న స్వేరోస్ తమ మద్దతు ఫలానా అభ్యర్థికే అని ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. ఆర్ఎస్పీ కూడా బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తుండడంతో చాలా మంది స్వేరోస్ అంటీముట్టనట్టగానే వ్యవహరిస్తున్నారు. కొంతమంది మాత్రం తమకు నచ్చిన పార్టీ వైపు, దళితుల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న వారికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed