లాక్‌డౌన్ ఎత్తేయాలా? పొడిగించాలా?.. డాక్టర్ నర్సింగ రెడ్డి సలహాలు

by  |
లాక్‌డౌన్ ఎత్తేయాలా? పొడిగించాలా?.. డాక్టర్ నర్సింగ రెడ్డి సలహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 ప్రపంచానికి పెద్ద పరీక్ష పెట్టింది. మనం ఇలా చేస్తామని ఎన్నడూ ఊహించని పనులను మనతో చేయించింది. షేక్ హ్యాండ్‌లు, ప్రేమతో ముట్టుకోవడాలు లాంటి చిన్న చిన్న పనులను కూడా ప్రమాదకరంగా మార్చింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఒకరితో ఒకరు కలవకూడదు. ఊరికే చెప్తే ఎవరూ వినరు. అందుకే ప్రభుత్వాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. మొదట 15 రోజులు అనుకున్న లాక్‌డౌన్, కేసులు పెరగడంతో నెల రోజులు దాటింది. మరి ఈ నెలరోజులు దాటుతున్నా కొన్ని చోట్ల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరి లాక్‌డౌన్ పొడిగించాలా? సడలింపులు ఇవ్వాలా? లాక్‌డౌన్ సాగిస్తే సామాజిక సమస్యలు మీద పడేందుకు రెడీగా ఉన్నాయి. దీంతో అనేక ప్రశ్నలు అటు ప్రభుత్వాలను ఇటు సామాన్య మానవుడిని ఇబ్బందిపెడుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటి గురించి ఒక అవగాహన రావడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి. నర్సింగ రెడ్డి కొన్ని సలహాలు సూచనలు చేశారు.

మొదటి ఆప్షన్ : లాక్‌డౌన్ పొడిగించడం.

ఇలా చేయడం వల్ల సామాజిక సమస్యలు విజృంభిస్తాయి. ఇప్పటివరకు ప్రభుత్వం పేదవాళ్లకు సాయం చేస్తున్నా ఇక మీదట దాన్ని కొనసాగించడం ఆర్థికంగా పెద్ద ఇబ్బందిగా మారుతుంది. అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఉత్పత్తి లేకపోవడంతో వారు వస్తువులను సరఫరా చేయలేరు. అటు తయారుచేసే వాళ్లు, ఇటు మధ్యవర్తిత్వం చేసేవాళ్లు, చివరికి కొనేవాళ్లు కూడా లేకపోవడంతో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అంతేకాకుండా ఇప్పటివరకు వాళ్ల దగ్గర పనిచేసిన ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా వారికి జీతాలిచ్చే స్థాయిలో కంపెనీ ఉండకపోవచ్చు. వారికి మిగిలేది దివాళా తీయడమే.

కేవలం చిన్న మధ్య తరహా పరిశ్రమలే కాదు, పెద్ద కంపెనీలు కూడా లాక్‌డౌన్ పొడిగిస్తే దెబ్బతింటాయి. ప్రణాళిక లేకుండా ఖర్చుపెడుతుండటంతో ప్రభుత్వాలకు కూడా భారం పెరుగుతుంది. పేదవాళ్లు తీవ్రంగా ప్రభావితమవుతారు. వీటికి తోడు చట్టపరమైన సమస్యలు, మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. తద్వారా చాలా జీవితాలు తిరోగమన రీతిలో ప్రభావితమవుతాయి. చాలా మంది జీవన ప్రమాణాలు మారిపోతాయి. ఈ ఆప్షన్ ఎంచుకున్న కొద్దిరోజులకే ఎందుకు ఎంచుకున్నామా అనే పశ్చాత్తాప పరిస్థితి ఏర్పడుతుంది.

రెండో ఆప్షన్: వ్యాపారాలు, పరిశ్రమలు, సామాన్యుడి జీవితాన్ని తెరవడం

ఈ ఆప్షన్ ఎంచుకుంటే సామాజిక సమస్యలు తగ్గినా… ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. నాకు దొరికిందే సందు అనుకుని కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. లాక్‌డౌన్ తీసేసిన మొదటి వారం రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇతర దేశాల్లో కరోనా వ్యాధి వ్యాపిస్తున్నపుడే మనం ఆసుపత్రులను అప్రమత్తం చేయాల్సింది. కేవలం లాక్‌డౌన్ పాటించడం వల్ల కేసులు తగ్గించే ప్రయత్నం చేశాం. ఎందుకంటే చాలా చిన్న పని. కానీ దాని నుంచి బయటపడటం కష్టమైన పనే. అయితే లాక్‌డౌన్ సడలిస్తే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని గ్యారంటీ లేదు. అది కేవలం అంచనా మాత్రమే. అలాగని వ్యాప్తి చెందదు అనే నమ్మకం కూడా లేదు. ఈ రెండు విషయాల్లో ఏది జరిగినా నష్టం తప్పదు.

మూడో ఆప్షన్: నిదానంగా లాక్‌డౌన్ ఎత్తేస్తూ, వైరస్‌ని కట్టడి చేయడం

ఈ మూడో ఆప్షన్‌లో, కరోనా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు, తక్కువ ఉన్న ప్రాంతాల్లో సడలింపులు చేస్తున్నాం. తద్వారా ఆసుపత్రులు తమ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే సమయాన్ని అందిస్తున్నాం. అంతేకాకుండా సామాన్యుడి జీవితం దారిన పడేందుకు అవకాశం కల్పిస్తున్నాం. వైరస్ దాడిని వీలైనంత మేరకు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నాం. సమస్య ఎక్కడో అక్కడే పరిష్కారం వెతుకుంటున్నాం. ఈ క్రమంలో మిగతా చోట్లకు సమస్య వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నాం. తద్వారా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు ఆరోగ్యానికి ఎలాంటి సమస్య రాకుండా మధ్యస్థ పరిష్కారాన్ని ఎంచుకుంటున్నాం. -డాక్టర్ నర్సింగరెడ్డి, ఐఎంఏ, జాతీయ ఉపాధ్యక్షుడు

Tags: corona, lockdown, measures, India, doctor narsinga reddy, ideas

Next Story

Most Viewed