ఆ 280 మంది ఎక్కడున్నారు?

by  |
ఆ 280 మంది ఎక్కడున్నారు?
X

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక ప్రార్థనల కోసం ఇటీవల ఢిల్లీ వెళ్లిన 280 మందిని గుర్తించేందుకు రాష్ట్ర యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. వారిని గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఇంతకీ వాళ్లను ఎందుకు అంతలా వెతకాల్సి వస్తోందంటే.. ఈ ప్రార్ధనల కోసం ఢిల్లీ వెళ్లిన ఇద్దరు గుంటూరు వాసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాలపై వారిని గుర్తించే పనిలో పడింది.

ఈ ప్రార్థనల నిమిత్తం ఎంతమంది ఢిల్లీ వెళ్లారు? ఢిల్లీ నుంచి తిరిగొచ్చి వారు ఎక్కడెక్కడ తిరిగి, ఎవరెవరిని కలిశారు? అనే వాటిని ఆరాతీస్తున్నారు. ఇలా వెళ్లిన వారిలో మెజారిటీ వ్యక్తులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే అధికంగా ఉన్నారని తేలింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోని అధికారులు, వలంటీర్ల సాయంతో వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు గుంటూరులో కరోనా పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన 128 మందిని, చీరాలకు చెందిన పాజిటివ్‌ వ్యక్తుల్ని కలిసిన మరో 35 మందిని గుర్తించారు.

ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్లిన వారి వివరాలను రైల్వే రిజర్వేషన్‌ ఆధారంగా గుర్తిస్తున్నారు. సుమారు 200 మంది ఒంగోలు రైల్వే స్టేషన్‌లోనే దిగినట్టు గుర్తించారు. ఇందులో 105 మందిని చీరాల పరిసర ప్రాంతాలతో పాటు కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, ఒంగోలు ప్రాంత వాసులుగా గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో కొందరిని హోం క్వారంటైన్‌లో ఉండమంటూ, మరి కొందరిని ఆసుపత్రి క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులకు తరలించారు.

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన 15 మంది ఢిల్లీ వెళ్లినట్టు గుర్తించారు. వారిలో ఇద్దరు కారంపూడి వాసులు, ఇంకో ఇద్దరు మాచర్ల తూర్పు బావి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఇద్దరు గుంటూరులో జరిగిన విందుకు హాజరైన తరువాత కరోనా కన్‌ఫర్మ్ అయింది. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు వారిని కలిసిన 32 మందిని కాటూరు ఆసుపత్రికి తరలించారు.

మరో ఘటనలో కజికిస్తాన్‌ నుంచి వచ్చిన ఓ వైద్యుడు క్వారంటైన్‌లోకి వెళ్లకుండా కనిగిరిలో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నట్లు నిర్ధారించిన అధికారులు, అతనిపై కేసు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలించారు. అతని వద్ద వైద్యసేవలొందిన 150 మంది రోగులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.

Tags : coronavirus, guntur district, chirala, macherla, covid-19

Next Story

Most Viewed