మిథాలీ రాజ్ vs రమేశ్ పవార్.. సఖ్యత కుదిరేనా?

by  |
Mithali Raj, Ramesh Powar
X

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా రమేష్ పవర్ తిరిగి నియమించబడ్డారు. గతంలో 2018 జులై నుంచి నవంబర్ వరకు రమేష్ పవార్ మహిళా జట్టు ప్రధాన కోచ్‌గా ఐదు నెలల పాటు పని చేశారు. కానీ ఆ సమయంలో కెప్టెన్ మిథాలీ రాజ్‌తో వివాదం చెలరేగడంతో వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది. రమేష్ పవార్‌పై పలు ఆరోపణలు చేస్తూ మిథాలీ రాజ్ ఆనాడే బీసీసీఐకి లేఖ కూడా రాశారు. అయితే అప్పుడే పవర్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో వివాదం అంతటితో సద్దు మణిగింది. తాజాగా రమేష్ పవార్ మరోసారి జాతీయ మహిళా జట్టు కోచ్‌గా నియమించబడ్డారు. టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నా.. వన్డే కెప్టెన్‌గా మాత్రం ఇంకా మిథాలీ రాజ్ కొనసాగుతున్నారు. పైగా 2022లో మిథాలీ కెప్టెన్సీలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ఆడాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో మరోసారి పవార్ కోచ్‌గా రావడంతో జట్టులో కలకలం రేగింది. బీసీసీఐకి వీరిద్దరి మధ్య ఉన్న వివాదం తెలిసినా ఎందుకు పవార్‌ను నియమించిందనే ప్రశ్న తలెత్తుతున్నది.

ఏమిటీ వివాదం?

ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ 2018 వెస్టిండీస్‌లో నిర్వహించారు. ఆ టోర్నీలో భారత జట్టు మ్యాచ్‌లు గెలుస్తూ ఓడుతూ సెమీస్ వరకు చేరుకున్నది. సరిగ్గా సెమీఫైనల్‌కు ముందు మిథాలీ రాజ్‌ను కోచ్ రమేష్ పవార్ తుది జట్టు నుంచి తప్పించారు. తనకు ముందే సమాచారం ఇవ్వకుండా జట్టు నుంచి ఎలా తప్పిస్తారంటూ మిథాలీ ఆనాడు కోచ్‌పై ఫైర్ అయ్యింది. కావాలనే తనను అవమానపర్చడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మిథాలీ ఆరోపించింది. జట్టులో సమానత్వం లోపించిందని.. ఒకరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మిథాలీ చెప్పింది. ఈ విషయాలన్నీ పేర్కొంటూ బీసీసీఐకి లేఖ రాసింది. అయితే పవార్ ఆమె ఆరోపణలన్నింటినీ ఖండించారు. ‘మిథాలీ జట్టు కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆడుతున్నది’ అని పవార్ కూడా ఆరోపించారు. వీరి వివాదం పెద్దగా మారుతుండటంతో బీసీసీఐ సూచనతో పవార్ అనాడు రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో అప్పటికి వివాదం సద్దు మణిగింది. కానీ ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి పని చేయాల్సిన సమయం రావడంతో అందరూ పాత వివాదాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు.

కీలకమైన వన్డే వరల్డ్ కప్..

భారత జట్టు వచ్చే ఏడాది కీలకమైన వన్డే వరల్డ్ కప్ ఆడనున్నది. వెటరన్ క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా వచ్చే ఏడాది వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నది. కానీ ఇదే సమయంలో రమేష్ పవార్ కోచ్‌గా రావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బీసీసీఐకి తెలిసి కూడా ఎందుకు అతడిని నియమించారని ప్రశ్నిస్తున్నారు. కాగా, కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలో పవార్ బెస్ట్ క్యాండిడేట్ అని క్రికెట్ అడ్వైజరీ కమిటీ భావించినట్లు తెలుస్తున్నది. రెండు ఫార్మాట్లలో భారత జట్టును ముందుకు తీసుకొని వెళ్లగలిగే సత్తా పవార్‌కు ఉన్నదని బీసీసీఐ పెద్దలు అంటున్నారు. ‘గతంలో జరిగిన వివాదాన్ని గుర్తు చేసుకోకుండా.,. మిథాలీ, పవార్ కలసి జట్టును నడిపించాలి. వారిద్దరూ కలసి ఉంటే భారత జట్టు మరింత ముందుకు దూసుకొని వెళ్లగలదు’ అని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ సభ్యురాలు డయానా ఎడుల్జీ అన్నారు. మిథాలీ, పవార్ గొడవ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని.. ఒక్క ఫోన్ కాల్‌తో ఈ సమస్య తీరిపోతుందని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా సూచించారు.


Next Story

Most Viewed