మహిళా కమిషన్‌ ఉన్నా.. మిషన్ సున్నా?

by  |
మహిళా కమిషన్‌ ఉన్నా.. మిషన్ సున్నా?
X

దిశ, హైదరాబాద్: మహిళలకు ఆపద సమయాల్లో భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమీషన్ ఉన్నా ఛైర్‌పర్సన్‌, సభ్యుల నియామకం లేకపోవడంతో బాధితులకు న్యాయం దక్కట్లేదు. 2018, జూన్‌లోనే ఛైర్‌ పర్సన్ పదవీ కాలం ముగిసినా ఇంతవరకు ప్రభుత్వం నియామకం చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో ట్యాంక్‌బండ్ సమీపంలోని బుద్ధభవన్‌ మహిళాకమీషన్ కార్యాలయం బోసిపోయినట్లు కనపడుతోంది. కేవలం కార్యదర్శి, సిబ్బంది మాత్రమే పనులను నెట్టుకురావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

మహిళా కమీషన్‌కు వచ్చే బాధితులు అనేక సమస్యలతో వస్తుంటారు. గృహహింస, వరకట్నం, కుటుంబ వివాదాలు, అత్యాచారం, పనిచేసే ప్రదేశాలలో వేధింపులు, ఉద్యోగ సర్వీసెస్ సమస్యలు, మిస్సింగ్, కిడ్నాప్ తదితర సమస్యలతో మహిళాకమీషన్‌ను ఆశ్రయిస్తారు. కానీ, బాధితులు వచ్చాక రిలాక్స్ అయ్యేందుకు ప్రత్యేక గదుల సౌకర్యం కూడా లేని పరిస్థితులు కనపడుతున్నాయి. కనీసం ఇక్కడ నమోదైన కేసులను బాధితుల తరుపున కోర్టుల్లో వాధించేందుకు ప్రత్యేక న్యాయవాదులు కూడా అందుబాటులో లేరు. దీంతో న్యాయం కోసం ఏళ్ల తరబడి కోర్టులు చుట్టూ తిరగడమే కాకుండా వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు.

రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిషన్ ద్వారా మొత్తం 450 కేసులు నమోదయ్యాయి. 2018లో 215, 2019లో 235 ఫిర్యాదులు అందాయి. వీటిలో 44 ఫిర్యాదులు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 39 పిటిషన్లు రాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2018లో 134, 2019లో 141 ఫిర్యాదులు అందాయి.

సమన్వయ లోపాలతో ..

మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచార కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కానీ, వేర్వేరు శాఖలు నిర్వహిస్తున్నందున బాధితులు న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బుద్ధభవన్‌లోని మహిళాకమీషన్ వద్దకు తమ గోడును చెప్పుకోవడానికి వెళ్లిన బాధితులు మహిళాకమీషన్ కార్యాలయంలో అధికారుల, సిబ్బంది సలహా మేరకు.. ఫిర్యాదును బట్టి మహిళా శిశు సంక్షేమ శాఖ, షీ టీమ్స్ భరోసా కేంద్రానికి లేదంటే సఖీ కేంద్రాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే కేసు పరిష్కారానికి చట్టపరమైన చర్యలకు అవకాశం ఉంది. కానీ, మహిళా కమీషన్ నుంచే నేరుగా బాధితులకు న్యాయం జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలేమీ కన్పించడం కాబట్టి షీ టీమ్స్, సఖీ సెంటర్లు విభాగాలను కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Tags: Telangana Women Commission, Chairperson, Members, Government, TS News, She Teams, Sakhi Centers, Women’s association



Next Story

Most Viewed