గ్రేటర్ పరిధిలో పరిశ్రమల తరలింపు ఇంకెప్పుడు..?

by  |
గ్రేటర్ పరిధిలో పరిశ్రమల తరలింపు ఇంకెప్పుడు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలను సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పనిచేయాలి. పరిశ్రమల తరలింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలి. పరిశ్రమల శాఖలో ఉన్న వివిధ డైరెక్టర్లు తమ పరిధిలోకి ఉన్న పరిశ్రమల తరలింపు వ్యవహారాలను సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం పర్యటించి నగరంలోని పరిశ్రమలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలి. -ఈనెల 5న టీఎస్ ఐఐసీ కార్యాలయంలో పరిశ్రమలశాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

పరిశ్రమలశాఖ, టీఎస్ ఐఐసీ శాఖల సమన్వయ లోపంతో గ్రేటర్ హైదరాబాద్ లోని కాలుష్య కారక పరిశ్రమలను పట్టణం బయటికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఆదేశాలను సైతం జారీ చేసింది. కానీ శాఖల మధ్య సమన్వయ లోపంతో పరిశ్రమల తరలింపులో రెండేళ్లపైనే జాప్యం జరుగుతోంది. దీంతో పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యంతో పాటు కంపెనీల్లోని రియాక్టర్లు పేలి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పడు ఏ ప్రమాదం జరుగుతోందనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

కాలుష్య పరిశ్రమలను దశలవారీగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 కిలో మీటర్ల అవతలికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సైతం సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులు దిశానిర్దేశం చేశారు. రాష్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) వెంటనే తరలిస్తున్నట్లు వివరాలు సైతం సేకరించింది. రెడ్, ఆరెంజ్ కేటగిరీల కిందకు వచ్చే కాలుష్య కారక 500ల పరిశ్రమలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీంతో పాటు 600 ఫార్మా కంపెనీలు, అనుబంధ కంపెనీలను ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి మార్చాలని నిర్ణయించింది టీఎస్ ఐఐసీ. అంతేకాదు వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు పరిశ్రమల తరలింపు కోసం అవసరమైన భూమిని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఆ ప్రకటనలు కేవలం ప్రకటనలకే పరిమితం అయింది.

ఖాజీపల్లి, ఉప్పల్, పాశమైలారం, చర్లపల్లి, పటాన్ చెరు, కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ప్రధానంగా ప్లాస్టిక్ విడి భాగాలు, స్టీలు విడిబాగాలు, రబ్బర్, బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే నాలాలు, కాల్వలు, చెరువులు, కుంట్లోకి వదులు తున్నారు. దీంతో జలాలు కాలుష్యమవుతుండటంతో పట్టణంలోని సుమారు 150 చెరువులు, కుంటలు ప్రమాద స్థాయికి చేరాయి. జలవనరులను కాపాడేందుకు తొలుత పారిశ్రామిక వాడల్లోని కాలుష్య కారక పరిశ్రమలను తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ దిశగా నేటికీ చర్యలు చేపట్టలేదు. తాజాగా ఈనెల 5వ తేదీన మంత్రి కేటీఆర్ టీఎస్ఐఐసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సమన్వయం చేసుకుంటూ టీఎస్ ఐఐసీ అధికారుల పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, అందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇది ఇలా ఉంటే ప్రభుత్వం తరలించాలని నిర్ణయించిన పరిశ్రమల్లో ఎక్కువగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వెయ్యి నూరు పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ పరిశ్రమలను నగరానికి దూరంగా ఏర్పాటు చేస్తే ఉపాధి కోల్పోవడంతో పాటు పరిశ్రమ వర్గాలపై సైతం రవాణాభారం పడటం, కార్మికుల కొరతను ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ తరలింపును మధ్య తరహా, భారీ పరిశ్రమలకు వర్తింప చేయాలని సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికులు కోరుతున్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి గాలి, నీటి పొల్యూషన్ ఏర్పడదని, కేవలం ఫార్మా, లెదర్, కెమికల్ కంపెనీలతోనే కాలుష్యం ఏర్పడుతుందని వాటిని తరలించాలని వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed