కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

by Batti.Sumithra |

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రైల్వే జేఏసీ, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మాడికొండ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ స్టేషన్ వరకు నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో వరంగల్ ప్రాంత యువత ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల కల సాకారం కావాలని అన్నారు. ఫ్యాక్టరీలో కల్పించే ఉద్యోగాల్లో స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైల్వే జేఏసీ తీసుకునే నిర్ణయాలకు అన్ని రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, జేఏసీ నాయకత్వంలో ఉద్యమం ఐక్యంగా కొనసాగాలని పిలుపునిచ్చారు.

ఫ్యాక్టరీలో సుమారు మూడు వేల ఉద్యోగాలను స్థానిక యువతకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు లేని యువతకు శిక్షణ అందించేందుకు ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ముందుకు రావాలని, అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు తాము కూడా సహకరిస్తామని తెలిపారు. స్థానిక యువతకు వారి అర్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అదేవిధంగా, కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు కూడా తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రాంత అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు మైలురాయిగా నిలవాలంటే స్థానికులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే JAC నాయకులు,ప్రజా సంఘాల నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story