కొడంగల్‌లో కేటీఆర్ ఆ పని చేసేదెప్పుడు.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు..?

by  |
కొడంగల్‌లో కేటీఆర్ ఆ పని చేసేదెప్పుడు.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు..?
X

దిశ, కొడంగల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే దత్తత తీసుకుంటా అంటూ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మాట ప్రకారం అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డిని కాదని.. గత ఎన్నికల్లో నరేందర్‌ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ, కొడంగల్ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాం అన్న కేటీఆర్ ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో పర్యటించకపోవడం గమనార్హం. త్వరలోనే మంత్రి పర్యటన అంటూ ప్రచారం చేసిన అధికార పార్టీ నాయకులు సైతం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు.

ఇదిలా ఉంటే గతంలో.. స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని మీడియాతో చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, డిగ్రీ కళాశాల, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, అప్పుడే దత్తత విషయం ప్రస్తావిస్తారని ప్రజలు అనుకున్నారు. హడావిడిగా పనులు పూర్తి చేసినా.. మంత్రి మాత్రం క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి రాలేదు. భవిష్యత్తులో కూడా వస్తారనే నమ్మకం లేదని.. కేవలం ఎన్నికల సమయంలోనే కొడంగల్ గుర్తొస్తుందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్ నియోజకవర్గంలో కనీసం బస్సు సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. టీఆర్ఎస్ గెలిచి మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. కనీసం బస్ స్టాండ్‌కు రంగులు కూడా వేసే తీరిక లేదు. బస్ స్టేషన్ ఆవరణ పందులకు స్థావరంగా మారింది. సాగు నీరు మాట లేదు.. మండలానికి ఒక్క జూనియర్ కాలేజ్ ఊసే లేదు. -ప్రతిపక్షాలు

కొడంగల్‌లో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నరేందర్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు.. ఇదంతా కేటీఆర్ దత్తత తీసుకున్నందుకే జరుగుతోంది. కేటీఆర్‌ నియోజకవర్గానికి రాకున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఢోకా లేదు. కేటీఆర్ సూచనల మేరకే కొడంగల్‌లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి డెవలప్‌మెంట్ చేస్తున్నారు. -టీఆర్ఎస్ నేతలు

Next Story