రక్తదానం కోసం యువకుడి సైకిల్ సవారి

by  |
రక్తదానం కోసం యువకుడి సైకిల్ సవారి
X

దిశ, ఫీచర్స్ : కోజికోడ్‌కు చెందిన 21ఏళ్ల మహమ్మద్ సహీర్‌ 2019లో బైక్ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో కొన్ని నెలలపాటు మంచానికే అంకితమయ్యాడు. ఆ సమయంలో ప్రాణం విలువతో పాటు, జీవిత సత్యాన్ని తెలుసుకున్న ఆ కుర్రాడు కోలుకున్న తర్వాత ఇతరులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. చేయూతనివ్వడానికి అతడు సమాయత్తామవుతున్న సమయానికి కొవిడ్ విపత్తు ముంచుకొచ్చింది. దాంతో కొవిడ్ సెంటర్లలో వాలంటీర్‌గా తన సేవను కొనసాగించాడు. అయితే కొవిడ్ సమయంలో రక్తదానానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రక్త నిల్వలు తగ్గిపోయాయని తెలుసుకున్నాడు సహీర్. దాంతో తన స్నేహితుడు ఫాది జియాద్‌తో కలిసి ‘బ్లడ్ డోనేషన్’పై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మంగళూరు నుంచి కన్యాకుమారికి సైకిల్‌ యాత్ర చేపట్టాడు.

సహీర్ కేవలం రూ.300తో తన ప్రయాణాన్ని ఆగస్టు 16న చేపట్టాడు. తను చేస్తున్న పనికి స్పందించిన తన మిత్రులు, దారిలో కలిసిన వ్యక్తులు వారికి తోచినంత విరాళాలు అందిస్తున్నారు. వారు రోజంతా ప్రయాణించి, రాత్రి సమయాల్లో బస్ స్టాప్‌, రైల్వే స్టేషన్స్‌లో బస చేస్తున్నారు. దక్షిణ కేరళలో మొదటిసారిగా ప్రయాణించడమే కాకుండా, మా ప్రయత్నం చాలామందికి రక్తదానం చేయడానికి స్ఫూర్తినిచ్చినందుకు చాలా సంతృప్తికరంగా ఉందని ఫాది జియాద్ అన్నారు.

‘యాక్సిడెంట్ తర్వాత గాయాల నుంచి కోలుకోవడానికి గడిపిన సమయం జీవితంలో చాలా పాఠాలు నేర్పింది. మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ప్రజలు రక్తదానం చేయడానికి ఇష్టపడలేదు. వారిలో అవగాహన పెంచడానికే సైకిల్ రైడ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. వీలైనంత ఎక్కువ మందిని రక్తదాతలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాను. స్నేహితుడు ఫాదితో ఆలోచనను పంచుకున్నప్పుడు, వెంటనే అంగీకరించి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. మా దృష్టి తక్కువ దాతలు ఉన్న దక్షిణ జిల్లాలపై ఉంది. కాబట్టి మా మొదటి అడుగు కోజికోడ్ నుంచి కన్యాకుమారి దిశగా సాగుతోంది. ఏడాది నుంచి CFLTCలో వాలంటీర్‌గా పని చేస్తున్నాను. అవసరమైన వారికి మందులు, నిత్యావసరాలను డోర్ డెలీవరి చేస్తుంటాను’ – మహమ్మద్ సహీర్

Next Story

Most Viewed