ప్రైవసీ పాలసీపై ‘వాట్సాప్’ యూ టర్న్..

by  |
Whastapp
X

న్యూఢిల్లీ : తమ నూతన ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత గోప్యతను భంగపరుస్తున్నదని కేంద్రం భావిస్తున్నదని, అందుకే ఈ పాలసీని బలవంతంగా అమలు చేయాలనుకోవడం లేదని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ సంస్థ తెలియజేసింది. తాత్కాలికంగా నూతన ప్రైవసీ పాలసీని నిలిపేస్తామని స్వచ్ఛందంగా నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్ చట్టం తెచ్చే వరకు ఈ పాలసీని నిలిపేస్తామని చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌ల ధర్మాసనానికి వాట్సాప్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే వివరించారు.

అయితే, యూజర్లకు ఎప్పటికప్పుడు నూతన అప్‌డేట్ నోటిఫికేషన్‌లు ఇస్తుంటామని తెలిపారు. వారు నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకున్నా యథావిధంగా సేవలు అందిస్తామని చెప్పారు. నూతన ప్రైవసీ పాలసీని తప్పనిసరి చేయడం లేదని స్పష్టం చేశారు. డేటా ప్రొటెక్షన్ చట్టం వచ్చాక భారత్‌లో తమకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తే వాటిని అమలు చేసుకుంటామని, లేదంటే నిబంధనలకు లోబడే సేవలందిస్తామని అన్నారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని ఇప్పటికీ అంగీకరించనివారికే ఈ నిలిపివేత వర్తిస్తుందని సంస్థ ప్రతినిధి వివరించారు.


Next Story

Most Viewed