‘నా ప్రాణానికి ప్రమాదం ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన కుంభమేళా మోనాలిసా

by Ramesh Naini |

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే తనకు ప్రాణహాని ఉందంటూ కేరళలోని కొచ్చి పోలీసులను ఆశ్రయించింది.

‘నా ప్రాణానికి ప్రమాదం ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన కుంభమేళా మోనాలిసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే తనకు ప్రాణహాని ఉందంటూ కేరళలోని కొచ్చి పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ, న్యాయ వివాదాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తన న్యాయవాదితో కలిసి ఎర్నాకుళం సెంట్రల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆమె, తనకు రక్షణ కల్పించాలని అధికారులను కోరింది.

తండ్రిపై తీవ్ర ఆరోపణలు

తన తండ్రి తన పాస్‌పోర్ట్‌ను లాక్కోవడమే కాకుండా, బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారని మోనాలిసా ఆరోపించింది. ‘నా జీవితం తీవ్ర ప్రమాదంలో ఉంది’ అని మీడియా ముందు వాపోయింది.

వయస్సు వివాదం.. కిడ్నాప్ కేసు

మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మోనాలిసా మైనర్ అని పేర్కొంటూ ఆమె తండ్రి మధ్యప్రదేశ్‌లో ఫిర్యాదు చేయడంతో, ఫర్మాన్ ఖాన్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. మరోవైపు, తాను మేజర్‌నని, స్వతంత్రంగా జీవించే హక్కు తనకు ఉందని మోనాలిసా స్పష్టం చేస్తోంది. గతంలో కేరళ హైకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలను బట్టి ఆమె మేజర్ అయి ఉండవచ్చని అభిప్రాయపడింది.

పోలీసు భద్రతపై విచారణ

గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు పోలీసులు భద్రత కల్పించినప్పటికీ, దంపతులు ఎక్కడ ఉంటున్నారో ఆచూకీ దొరక్కపోవడంతో ఆ రక్షణను ఉపసంహరించుకున్నారు. అయితే, అవసరమైతే మళ్లీ పోలీసులను సంప్రదించే వెసులుబాటును కోర్టు కల్పించడంతో మోనాలిసా తాజాగా ఫిర్యాదు చేసింది. మోనాలిసా చేసిన ఆరోపణలు, రక్షణ విజ్ఞప్తిపై కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్‌తో చర్చించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

Next Story