కేసీఆర్ పర్యటన వెనక ఆంతర్యం ఏంటి?

by  |
కేసీఆర్ పర్యటన వెనక ఆంతర్యం ఏంటి?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వెనక ఆంతర్యం ఏంటో అంతుబట్టడం లేదు. సోమవారం మధ్యాహ్నం ప్రోగ్రాం షెడ్యూల్ రాగానే అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేశారు. ఇంతకీ సీఎం పర్యటనకు కారణమేంటన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లభించడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 100 అడుగుల మేర నీటి నిల్వ ఉండడంతో మొదటిసారిగా 16 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుందని, ప్రత్యక్షంగా చూసేందుకు సీఎం వచ్చారని అధికారవర్గాలు చెప్పాయి.

వాస్తవం మాత్రం వేరేనన్న చర్చ సాగుతోంది. కన్నెపల్లి పంప్‌ హౌస్‌లో మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు బిగించిన ఆరు మోటార్లను పరిశీలించేందుకు సీఎం వచ్చి ఉంటారని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అదనపు టీఎంసీ పనులు నిలిపి వేయాలని చెప్పడంతో అక్కడికి వెళ్లడం సముచితం కాదని భావించే వ్యూహాత్మకంగా మేడిగడ్డ బ్యారేజీ టూర్‌కు వచ్చా‌రని అనుకుంటున్నారు.

కాళేశ్వరం దర్శనం అనంతరం ఏరియల్ వ్యూలో మూడో టీఎంసీ కోసం ఏర్పాటు చేసిన మోటార్లను పరిశీలించి ఉంటారని అంటున్నారు. ఈ కారణంగానే మొదట మేడిగడ్డ పర్యటన ఖరారు చేసి తరువాత కాళేశ్వరం ఆలయంలో పూజలు చేయాలని నిర్ణయించారని భావిస్తున్నారు. అయితే ఎక్కువగా నెంబర్ ఆరును తన సెంటిమెంట్‌గా భావించే కేసీఆర్ ఇప్పటి వరకు ఏడుసార్లు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడంతో మరోసారి ఈ టూర్ ఫిక్స్ చేసి ఉంటారనే చర్చ సాగుతోంది.

సైలెన్స్ సస్పెన్స్

ఆలయాల దర్శనం అంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉండే సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటనలో సైలెంట్‌గా ఉండేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. పూజల అనంతరం వేద పండితులను ఆప్యాయంగా పలకరించే వారు. ఈసారి ముభావంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు నడుం వద్ద నొప్పిగా ఉందని పంచామృత అభిషేకం తన భార్య శోభారాణి చేతుల మీదుగా జరిపించారు. అనంతరం గోదావరి తీరానికి వెళ్లిన ముఖ్యమంత్రి బ్యాక్ వాటర్‌ను చూసి ఆనందంగా ఉందంటూ కామెంట్ చేశారు. గోదావరి మాతకు పూజలు చేసిన అనంతరం భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్నారా? అని వేద పండితులను ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికి నాలుగు సార్లు కాళేశ్వరం టెంపుల్‌ను సందర్శించగా, గతంలో ఏనాడూ ఇంత తక్కువగా మాట్లాడలేదు. ఈసారి విభిన్నంగా వ్యవహరించడం గమనార్హం.

ఉద్రిక్తతల నడుమ

సీఎం కేసీఆర్ పర్యటన మరోసారి ఉద్రిక్తతల నడుమే సాగింది. మంగళవారం పర్యటన సమయంలోనూ సరిహద్దులలో అలజడి నెలకొంది. మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల ఉనికిని కట్టడి చేసేందుకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా గంగుళూరు ఆటవీ ప్రాంతంలో మావోయిస్టులకు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇదే సమయంలో సీఎం కాళేశ్వరం ఏరియల్ టూర్ చేయడం గమనార్హం. గతంలో కూడా మేడిగడ్డకు కొద్ది దూరంలోనే ఉన్న మహారాష్ట్రలోని జింగనూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులలో తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు. మరునాడే సీఎం కేసీఆర్ కాళేశ్వరం సందర్శించారు. మరోసారి మావోయిస్టుల బంద్ నేపథ్యంలోనూ ఎనిమిదోసారి కాళేశ్వరం విజిట్ చేశారు.

Next Story

Most Viewed