సాగర్ అభ్యర్థిపై నో క్లారిటీ… బీజేపీ వ్యూహమేనా..?

by  |
సాగర్ అభ్యర్థిపై నో క్లారిటీ… బీజేపీ వ్యూహమేనా..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఊపుమీదున్న బీజేపీ బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్రంలో దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ తన ప్రాబల్యం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని గుర్రంబోడు తండా భూముల వ్యవహారంలోనూ బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ చేపట్టిన కార్యక్రమంలో ఒక్కసారిగా జిల్లాలో హీట్‌ను పెంచింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికకు పోటీ నిలిపేందుకు అభ్యర్థి విషయంలో కొంత నాన్చుడు ధోరణిని పాటిస్తోంది. నిజానికి అది బీజేపీ వ్యుహామా.. లేక బలమైన అభ్యర్థి దొరక్కా అన్నది తేలాల్సి ఉంది. సాగర్ ఉపఎన్నికలో అభ్యర్థి ఎవరనే అంశంపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

వ్యూహమా.. అభ్యర్థి లేకనా..?

సాగర్ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ ముందుంది. టీఆర్ఎస్‌లో అభ్యర్థిత్వానికి పోటీ ఎక్కువ కావడంతో అధినేత సంయమనం పాటిస్తున్నారు. వాస్తవానికి అభ్యర్థిని ఖరారు చేసినా, ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఇబ్బందులు కొనితెచ్చుకోవడం ఎందుకని ప్రకటించడానికి సాహసించడం లేదు. టీడీపీ సైతం ఇప్పటికే అభ్యర్థి పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను ఢీకొట్టాలంటే దీటైన అభ్యర్థి అవసరం కాబట్టే బీజేపీ వ్యుహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీఆర్ఎస్‌లో ప్రస్తుతం సాగర్ ఉపఎన్నిక ఆశిస్తున్న ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, బడుగుల లింగయ్యయాదవ్ తదితరుల్లో ఎవరినైనా లాక్కునేందుకు బీజేపీ అధిష్ఠానం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

నివేదితా పోరుబాట తిరస్కరణ కారణమేంటి…?

నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్​చార్జి కంకణాల నివేదితారెడ్డి, కడారి అంజయ్యయాదవ్‌ సాగర్ ఉపఎన్నిక టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరి మధ్యే ప్రధాన పోటీ. ఈ క్రమంలోనే నివేదితారెడ్డి ఇటీవల గుర్రంపోడు మండలం నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరుబాటను చేపట్టింది. నివేదితా ఉదయం ప్రారంభించిన పోరుబాటను సాయంత్రానికే ముగించింది. నివేదితారెడ్డి మొదలుపెట్టిన పోరుబాటను సాయంత్రానికి ఆమె భర్త, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాయకత్వం నివేదితారెడ్డి యాత్రను ఎందుకు తిరస్కరించారనేది తేలక ఉపఎన్నిక టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నివేదితా రెడ్డి ఆశలు అడియాలవుతాయా? అన్న సందిగ్ధంలో పడ్డారు.

బీజేపీ ప్లానేంటి..?

సాగర్ ఉపఎన్నికలో గెలుపు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలిచి తెలంగాణలో కనుమరుగే అన్న విమర్శను తిప్పికొట్టాలని కాంగ్రెస్ బలంగా ప్రయత్నిస్తుండగా, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు శాశ్వతం కాదని నిరూపించాలని టీఆర్​ఎస్​ చూస్తోంది. అదే సమయంలో ఆయా ఎన్నికలు నామమాత్రం కాదని, తమ బలం పెరిగిందని నిరూపించుకోవాలని బీజేపీ చూస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. నిజానికి కాంగ్రెస్ నేత జానారెడ్డి కొడుకు రఘువీర్‌రెడ్డిని బీజేపీలో నుంచి రంగంలోకి దించేందుకు ప్రయత్నించగా అనివార్య కారణాలలో ప్రయత్నం సఫలం కాలేదు. ఈసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన నేతను లాగాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడే అభ్యర్థిని ఖరారు చేయకుండా ప్లాన్‌ చేస్తోంది.

Next Story

Most Viewed