80 కోట్లు ఖర్చు చేసినా పేదలకు అందని ఇల్లు..

by  |
80 కోట్లు ఖర్చు చేసినా పేదలకు అందని ఇల్లు..
X

దిశ, భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇల్లు జిల్లాలో ఇంత వరకు ఏ గ్రామంలో పూర్తికాకుండానే అసంపూర్తిగా ఉన్నాయి. జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ అవి బూడిదలో పోసిన పన్నీరు గానే ఉండి పోయాయి. ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టినా పేదవారు మాత్రం ఆ ఇళ్లలో నివాసముండే యోగ్యత లేకుండా పోయింది. భూపాలపల్లి జిల్లాలో 11 మండలాల్లో 3891 ఇల్లు మంజూరు అయ్యాయి. ఇట్టి ఇండ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. లబ్ధిదారుల భాగస్వామ్యంతోనే ఇళ్ల నిర్మాణం జరగడంతో ఇల్లు నిర్మించేందుకు లబ్ధిదారులు ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో 1325 ఇళ్లను ప్రభుత్వం శంకుస్థాపన చేయలేదు. మిగిలిన వాటిలో ఎనిమిది వందల ఇరవై ఇండ్లు మాత్రమే జిల్లాలో పూర్తిగా నిర్మాణం జరిగింది.

ఇండ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ వాటిలో ఇంతవరకు లబ్ధిదారులు నివాసం ఉన్న దాఖలాలు లేవు. 853 ఇల్లు మాత్రం స్లాబ్ లెవల్ నిర్మాణం చేసి వదిలిపెట్టారు. 23 ఇల్లు గోడల వరకు నిర్మాణం జరిగింది. 251 ఇళ్లకు ప్లాస్టింగ్ చేసి వదిలి వేశారు. 59 ఇల్లు మాత్రం పునాదుల వారికే పరిమితమైంది. 456 ఇల్లు పునాదులపైకి నిర్మాణం జరిగి వదిలేశారు. ప్రభుత్వము రెండు పడక గదుల నిర్మాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేక పూరిగుడిసెలో తాటాకులు వేసుకొని నివాసం ఉంటున్న వారు వేలమంది ఉన్నారు. తడకలతో ఇల్లు నిర్మించుకుని ఎండకు ఎండుతూ వానకు, చలిలో వణుకుతూ జీవితాలను వెళ్ళదీసేవారు ఎంతో మంది ఉన్నారు. అట్టి వారిని గుర్తించి ప్రభుత్వం రెండు పడక గదుల నిర్మాణం చేసి వారికి ఇవ్వాల్సి ఉండగా ఆ ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. తెరాస ప్రభుత్వం తన మేనిఫెస్టోలో రెండు పడక గదుల నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేసింది.

ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సైతం రెండు పడకల ఇల్లు ఓ కారణమైంది. ఎంతోమంది నిరుపేదలు ఇల్లులేని వారు తమకు ఐదు లక్షల రూపాయల విలువైన రెండు పడక గదుల ఇల్లు వస్తుందని ఆశతో ప్రభుత్వానికి మద్దతు పలికి గెలిపించారు. అట్టి పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చి నిరుపేదలకు రెండు పడక గదుల ఇల్లు అందకుండా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి అది లబ్ది దారులు తమకు ఉన్న చోట నిర్మించుకుంటే బిల్లు చెల్లించే వారు. లబ్ది దారులు తమకు ఇష్టమున్నా విధంగా ఇల్లు నిర్మించుకుని అదనంగా డబ్బులు వెచ్చించి అందంగా ఇల్లు నిర్మించుకునే వారు. తెరాస ప్రభుత్వం అది కాదని, ప్రభుత్వ భూముల్లో రెండు పడక గదుల కాలనీ నిర్మించి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది, ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ అమలు చేయడంలో మాత్రం జాప్యం జరుగుతుంది.

తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ఇంతవరకు జిల్లాలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం గమనార్హం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అధికారుల అలసత్వం తెలియజేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తున్నా ఇప్పటికీ అది అమలులోకి వచ్చేసరికి పేద ప్రజలకు అందని ద్రాక్ష పండుగానే మిగులుతుంది.

ముందుకు రాని లబ్ధిదారులు

రెండు పడక గదుల ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో లబ్ధిదారులను సంఘంగా ఏర్పడి ఇల్లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. లబ్దిదారుల మధ్య సరైన అవగాహన లేక ఈ నిర్మాణం జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణం సగం వరకే చేసి నిలుపుదల చేశారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ట్రాక్టర్లకు సరైన లాభం లేకపోవడంతో కారణమైంది.

నాణ్యతకు తిలోదకాలు..

గ్రామాల్లో కాంట్రాక్టర్లు నిర్మించే ఈ నేలలో నాణ్యత లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో సక్రమంగా సిమెంటు ఇసుక లేదని నాసిరకమైన వస్తువులు వాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నిర్మించిన ఇళ్లకు సక్రమంగా నీరు సైతం పట్టిన సందర్భాలు లేవు. ఇండ్ల నిర్మాణము భూమి లేవల్ వరకే ఉండడంతో లబ్ధిదారులు ఆ ఇండ్లు పూర్తయిన అందులో నివాసం ఉండే విధంగా లేవు. ఇళ్ల పునాది భూమి లెవల్ వరకే తీయడంతో లబ్ధిదారులు అందులో ఉండేందుకు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వము ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చే ప్లాన్ సక్రమంగా లేదని ఆరోపణలు ఉన్నాయి.
నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వండి

జిల్లాలో మంజూరైన ఇళ్లను నిర్మించి పేద ప్రజలకు ఇవ్వాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసి కేవలం మంజూరు పత్రాలకే పరిమితం కాకుండా రెండు పడక గదుల నాణ్యమైన విధంగా నిర్మించి నిరుపేద వర్గాలు అందులో నివాసం ఉండే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


Next Story