గణేశ్ నిమజ్జనంపై వైఖరేంటి?

by  |
high court copy
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై ప్రభుత్వ వైఖరేంటని హైకోర్టు ప్రశ్నించింది. వినాయక చవితి పండుగ, ఆ తర్వాత నిమజ్జనానికి భారీ సంఖ్యలో జనం గుమికూడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. గతేడాది కరోనా కారణంగా గణేశ్ నిమజ్జనానికి విధించిన ఆంక్షలు, నిబంధనలు యధావిధిగా ఉంటేనే మంచిదని హైకోర్టు అభిప్రాయపడింది. సడలింపులు ఇవ్వడం మంచిది కాదనే భావిస్తున్నంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తున్నదో వివరాలను అఫిడవిట్‌లో అందించాలని స్పష్టం చేసింది. గణేశ్ నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ జలాలు కలుషితమవుతున్నాయని, కాలుష్యం పెరిగిపోతున్నదని, దాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపైన దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 18వ తేదీన తదుపరి విచారణ జరిగే సమయానికి అఫిడవిట్‌ను అందజేయాలని స్పష్టం చేసింది.

వైద్యారోగ్య శాఖకూ ఆదేశాలు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు, వినాయకచవితి ఉత్సవాల్లో జనం గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. మరికొన్ని పండుగలు కూడా ఉన్నందున వాటికీ జనం గుమిగూడకుండా చూడాలని ఆదేశించింది. ఆంక్షలు, మార్గదర్శకాలను వీలైనంత ముందుగానే ప్రజలకు తెలియజేయాలని, మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు కచ్చితమైన ప్రణాళికను రూపొందించాలని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల తరహాలోనే వివిధ అంశాల ఆధారంగా నిర్దిష్టమైన రోడ్ మ్యాప్‌ను తయారు చేయాలని, సీరో సర్వియలెన్స్ వివరాలను సమర్పించాలని, కరోనాపై ఏర్పాటైన కమిటీ సమావేశం వివరాలను కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 8కి వాయిదా వేసింది.


Next Story

Most Viewed