రామగుండం కాంట్రాక్టు ఉద్యోగులు జీవితాలలో వెలుగులు నిండేనా?

by Disha edit |
రామగుండం కాంట్రాక్టు ఉద్యోగులు జీవితాలలో వెలుగులు నిండేనా?
X

ప్రజలకు జిగేలుమనే విద్యుత్తును అందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలను చీకటీకి పరిమితం చేయడం అన్యాయం. కేంద్రం స్పందించి నాటి ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు స్థిరమైన పనిస్థలాలను కేటాయించాలి. పదోన్నతులు, సమాన పనికి సమాన వేతనం, ఆనారోగ్య సమస్యలున్న కార్మికుల స్థానంలో డిపెండెంట్‌లకు అవకాశం ఇవ్వాలి. కనీస జీవన ప్రమాణాలతో జీవించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు.

ష్టజీవి కాళ్లు చేతులు లోకానికి సూర్యచంద్రులు అన్నాడు' విప్లవ కవి చెరబండరాజు. కానీ, పెట్టుబడిదారీ విధానమేమో కష్టజీవిని కాంట్రాక్ట్ కార్మికుడిగా పరిగణించింది. కులవృత్తుల మధ్య వివక్ష ఉన్నట్లుగానే కార్మికుల శ్రమ మధ్య కూడా అన్ స్కిల్డ్, సెమి స్కిల్డ్, హై స్కిల్డ్ అంటూ వివక్షను చూపుతున్నారు. పారిశ్రామిక రంగంలో ఎక్కువ మంది చేసే పనిని అన్ స్కిల్డ్‌గా పరిగణించి సులువుగా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌లోనూ శ్రమ దోపిడీ జరుగుతోంది.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీ‌పీ‌సీ)ని రామగుండంలో అప్పటి ప్రధాని మొరార్జీ‌ దేశాయ్ 1978 నవంబర్ 14న ప్రారంభించారు. 200 మెగావాట్ యూనిట్లతో ప్రారంభమైన ఉత్పత్తి క్రమక్రమంగా 2,600 మెగావాట్లకు చేరుకుంది. ఏడాదికి 2 కోట్ల 15 లక్షల 94 వేల 653 మిలియన్ యూనిట్ కరెంటును ఉత్పత్తి చేస్తోంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద విద్యుత్త్ ఉత్పత్తి సంస్థగా, నవరత్న సంస్థగా వెలుగొందుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రకు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇందులో మానవ శ్రమ వినియోగం ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 0.51 శాతం కాగా, 2021 నాటికి 0.3 శాతానికి తగ్గింది. ఆపరేషన్ విభాగం మినహా మిగితా అన్ని విభాగాలలో కలిపి 3,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.

ఒప్పందానికి విఘాతం

2018లో ఎన్‌టీ‌పీ‌సీ యాజమాన్యంతో రామగుండం కార్మికులు 1947 పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం బైపార్టీయేట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ చట్టం, కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం 2022 ఏప్రిల్ నుంచి అన్ స్కిల్డ్ వారికి రోజుకు రూ.581, సెమి స్కిల్డ్ వారికి రూ. 656, స్కిల్డ్ వారికి రూ. 770, హై స్కిల్డ్ వారికి రూ. 846 చొప్పున బకాయిలు చెల్లించవలసి ఉంది. ఇంతవరకు చెల్లించలేదు. చట్టబద్ధ ఒప్పందం అయినప్పటికీ దానిని అమలు చేయడానికి యాజమాన్యం మొండికేస్తోంది.

సమస్యల పరిష్కారం గురించి జేఏసీ హెఆర్‌ను కలవడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. దీనికి నిరసనగా ఆగస్ట్ 22న రెండవ గేట్ ముందర కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో యాజమాన్యం సీఐఎస్ఎఫ్ జవాన్‌లతో వారి మీద దాడి చేయించింది. కౌశిక్ హరి, ఇస్సంపల్లి రాజయ్య తలలు పగిలాయి. వందల మందిపై లాఠీ ప్రయోగం చేశారు. సమస్య పరిష్కారానికి యాజమాన్యం ఇప్పటికి చొరవ చూపకపోవడంతో నిరసన కార్యక్రమాలు నేటికీ జరుగుతున్నాయి. ప్రజలకు జిగేలుమనే విద్యుత్తును అందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలను చీకటీకి పరిమితం చేయడం అన్యాయం. కేంద్రం స్పందించి నాటి ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు స్థిరమైన పనిస్థలాలను కేటాయించాలి. పదోన్నతులు, సమాన పనికి సమాన వేతనం, ఆనారోగ్య సమస్యలున్న కార్మికుల స్థానంలో డిపెండెంట్‌లకు అవకాశం ఇవ్వాలి. కనీస జీవన ప్రమాణాలతో జీవించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు.

మేరుగు రాజయ్య

కేంద్ర కార్యదర్శి,

ఏఐటీయూసీ, సింగరేణి

9441440791



Next Story

Most Viewed