అక్రమంగా ఆక్సిజన్ తరలిస్తూ దొరికిపోయారు

by  |
అక్రమంగా ఆక్సిజన్ తరలిస్తూ దొరికిపోయారు
X

దిశ, క్రైమ్ బ్యూరో: కోవిడ్ రోగులకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సేవలు ఇంటి వద్దకే అందజేస్తానంటూ చెప్పుకుంటూ అక్రమంగా బ్లాక్ దందాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మల్కాజిగిరి ఎస్ఐ జె.అశోక్ కుమార్ సోమవారం రాత్రి 9.30 గంటలకు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా.. ఓమ్నీ వ్యాన్‌లో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ దందా చేసేందుకు ఇసీఐఎల్, మౌలాలి వైపు వెళ్తున్నట్టు సమాచారం అందుకున్నారు. ఈ సమయంలో వెంటనే ఎస్ఓటీ పోలీసులకు ఎస్ఐ అశోక్ కుమార్ సమాచారం అందించారు. దీంతో జడ్‌టీఎస్ క్రాస్ రోడ్స్, మౌలాలి వద్ద రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఏపీ 09 ఏఆర్ 0232 నెంబరు కలిగిన ఓమ్నీ వ్యాన్ అనుమానస్పదంగా కన్పించడంతో తనిఖీ చేశారు. ఈ వ్యాన్‌లో ఒక్కో లిసిండర్ 150 లీటర్ల ఆక్సిజన్ కలిగిన 5 సిలిండర్లను గుర్తించారు. వీటికి సంబంధించిన ఎలాంటి పత్రాలను డ్రైవర్ సయ్యద్ అబ్దుల్లా (30), మహ్మద్ మజర్ (37), సయ్యద్ ఆసిఫ్ (34)లు చూపించకపోవడంతో వ్యాన్‌తో పాటు సిలిండర్లు, ఓమ్నీ వ్యాన్, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. దీంతో సయ్యద్ సల్మాన్ నుంచి ఆసీఫ్ ఒక్కో సిలిండర్ ధర రూ.16 వేలకు కొనుగోలు చేసి, ఆక్సిజన్ అవసరమైన కోవిడ్ పేషెంట్లకు రూ.25 వేలకు అధిక ధరకు చట్ట విరుద్దంగా ఆక్సిజన్ బ్లాక్ దందా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా 5 సిలిండర్లు, రెండు సెల్ ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ ఎస్ఓటీ డీసీపీ సురేందర్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed