విశాఖ దుర్ఘటనకి వారం రోజులు.. ఈ ప్రశ్నలకు బదులేది?

by  |
విశాఖ దుర్ఘటనకి వారం రోజులు.. ఈ ప్రశ్నలకు బదులేది?
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ఘటన చోటుచేసుకుని నేటికి సరిగ్గా వారం రోజులు. ఈ వారం రోజుల్లో చోటుచేసుకున్న సంఘటనలు ఏంటి? నష్టం ఎంత? లాభం ఎవరికి? అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు వెతికిందా? ప్రభుత్వంపై విమర్శలేంటి? అన్న వివరాల్లోకి వెళ్తే….

గత గురువారం రాత్రి వెంకటాపురం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు, పద్మనాభ పురం, నందమూరి నగర్‌లకు కాళరాత్రిగా మారింది. వేకువజామున నిద్రలేచే సరికే మబ్బులు కమ్మినట్టు కమ్మేసిన స్టైరన్ విషవాయువు. పరుగుతీసేందుకు కూడా శక్తిలేక ఉన్నచోటే కూలబడిన వారు భారీ ఎత్తున ఉంటే, రెండడుగులు వేసి కుప్పకూలినవారెందరో.. ప్రమాదం పసిగట్టే సరికే పరిస్థితి శృతి మించింది. 12 మందికి అదే చివరి రోజైంది. ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఏం జరుగుతుందో, ఎంత ప్రమాదమో తెలియకుండా మొండి ధైర్యంతో ముందుకు దూసుకెళ్లారు. గ్యాస్ వ్యాపించిన ఊర్ల చుట్టుపక్కల ప్రాంతాల యువకులు కూడా మొండి ధైర్యంతో దూసుకెళ్లారు. స్టైరిన్ ఎంత ప్రమాదమో తెలియకుండానే దొరికినవారిని దొరికినట్టు వాహనాల్లోకి ఎక్కించారు. అంత విలయంలోనూ వీరోచితంగా వారు స్పందించకుంటే ప్రమాదం తీవ్రత భోపాల్ గ్యాస్ దుర్ఘటనను కూడా మించిపోయి ఉండేది. ఇంతలో ప్రభుత్వం స్పందించింది. గ్యాస్ తీవ్రతకు పోలీసులు కూడా స్పృహ తప్పిపోయారు. ఇంతలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రసాయన శాస్త్రవేత్తలు, నిపుణులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీఎం
ఆఘమేఘాల మీద వైజాగ్ చేరుకుని, మృతుల కుటుంబాలకు కోటి, బాధితులకు పది లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి లక్ష, నిందిత కంపెనీ పరిసరాల్లోని గ్రామాల్లో ప్రతి ఇంటికీ పది వేల రూపాయల పరిహారం ప్రకటించారు.

మూడు రోజుల పాటు మంత్రులు మాటువేసి పరిస్థితిని సమీక్షించి, అంతా బాగుందని సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడే సమాధానం లేని ప్రశ్నలు ఎన్నింటినో అలాగే వదిలేశారు. ప్రమాదంలో సుమారు ఎంత మంది బాధితులు అన్నది ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు. మంత్రులు కేజీహెచ్‌లో బాధితులు 341 మందిగా ప్రకటించారు. 80 మంది వెంటిలేటర్‌పై ఉన్నట్టు తెలిపారు. ఎవరిని, ఏ కేటగిరీలో చేర్చారు? ప్రమాదం సమయంలో బాధితులు వెయ్యి మందికిపైగా ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి. వైజాగ్‌లోనే కాకుండా దగ్గర్లోని కొత్తవలస, పెందూర్తి వంటి ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో కూడా బాధితులు చేరారన్న వార్తా కథనాలు వచ్చాయి. మృతుల్లో 12వ వ్యక్తి కొత్తవలసలో చికిత్స పొందుతూ మృతి చెందడం విశేషం.

ప్రమాదం సమయంలో కంపెనీలో 15 మంది ఉన్నారని సమాచారం. పరిసర గ్రామాల్లోని వారే తీవ్ర పరిణామాలెదుర్కొంటే.. కంపెనీలో ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఇంత పెద్ద ప్రమాదం సమయంలో వారిని ఎందుకు బయటకు తేలేదు. 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నిల్వ ఉంచాల్సిన స్టైరిన్ గ్యాస్ ఎలా లీకైంది?.. ట్యాంక్‌లో పేలుడు చోటుచేసుకోకుండా కంపెనీ సిబ్బందే సేఫ్టీ వాల్వ్ ఓపెన్ చేశారని కధనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ ఎందుకు విడుదల చేయలేదు. కంపెనీ ప్రతినిధులు సీఎంతో సమావేశమై ఏం చర్చించారు? కంపెనీపై ఇన్ని రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? కంపెనీతో ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారనేది నిజమా?

ప్రమాదం జరిగిన మూడు రోజుల తరువాత కంపెనీ క్షమాపణలు కోరుతూ ప్రకటన చేసింది. అదే సమయంలో చుట్టు పక్కల బాధిత గ్రామాలను ఆదుకుంటామని చెప్పింది… ఇంత వరకు కంపెనీ ఏం చేసింది? ప్రభుత్వానికి, కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి? లక్ష రూపాయలని చెప్పి కేజీహెచ్‌‌లో బాధితులకు 25 వేల రూపాయలు చెక్కులు ఇచ్చారు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ఆ డబ్బులేమయ్యాయి. బాధితుల లెక్కల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయా?.. ప్రమాదం చోటుచేసుకున్న తరువాత కంపెనీని తరలించాలంటూ చేసిన ఆందోళన కారులపై ప్రభుత్వం ఎందుకు కేసులు బనాయించింది? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకకపోవడం విశేషం.



Next Story

Most Viewed