తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

by Yella Dhawani Reddy |

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు జోరందుకోనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) మళ్లీ వానలు (Rains) జోరందుకోనున్నాయి. నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉదయం పొడి వాతావరణం ఉంటుందదని, మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా అనిపించినా.. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇవాళ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, శుక్రవారం (రేపు) యాదాద్రి భువనగిరి, జనగామ, వికారాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో.. శనివారం (ఎల్లుండి) నిర్మల్, కుమురం భీం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇక ఏపీలో వచ్చే 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, శుక్రవారం కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో.. శనివారం పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Next Story