స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, సీఎం రేవంత్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-22 07:54:49  IST  )

ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 6.30కి ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, సీఎం రేవంత్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics)లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ మధ్యకాలంలో నిత్యం ఉప్పు, నిప్పులా ఉంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఒకే సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరగబోయే కీలక భేటీ ఇందుకు వేదిక కానుంది.

కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ భేటీ ఖరారైంది. ‘ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాను.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయండి’ అంటూ అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఓ అధికారిక లేఖ రాశారు. సీఎం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ భేటీని ఖరారు చేయడమే కాకుండా, స్వయంగా తాను కూడా ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరగబోయే ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో టేకోవర్ (Hyderabad Metro Takeover), మెట్రో ఫేజ్-2 విస్తరణ (Metro Phase-2 Expansion)తో పాటు, వీటికి సంబంధించిన ఐఆర్ఎఫ్ (IRCF) రుణాల విడుదల అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.

హాట్‌టాపిక్‌గా ఇద్దరి కలయిక..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, నిధుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య నిత్యం రాజకీయ యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అలాంటి ఇద్దరు అగ్ర నేతలు, సీఎం లేఖ రాయడం-దానికి కిషన్ రెడ్డి చొరవ చూపి ఒకే గదిలో కూర్చుని కేంద్ర మంత్రితో రాష్ట్ర ప్రాజెక్టుల గురించి చర్చించబోతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా భేటీ తర్వాత తెలంగాణ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Next Story