సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం చేస్తాం

by  |
Kritika Shukla
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా భరోసా కల్పించారు. ఆదివారం కర్నూలు నగరంలోని చాణిక్యపురి కాలనీ నేహా రెసిడెన్సిలో నివాసం ఉంటున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఎస్‌.రాజు నాయక్, ఎస్‌. పార్వతి దేవిలతో కృతికా శుక్లా భేటీ అయ్యారు. దాదాపు ఒక గంట సేపు ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రీతి తల్లిదండ్రులు ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ స్వయంగా తనను సీఎం వైఎస్ జగన్ పంపించారని.. ఆయన ఆదేశాల మేరకు తాను రావడం జరిగిందని తెలిపారు. రిలీఫ్, ఇతర సహాయం గురించి తెలుసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోరినట్లు తెలిపారు.

సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. సీబీఐ విచారణ కోసం హైకోర్టు తరఫునుంచి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్పతో స్త్రీశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా సమావేశమయ్యారు. సుగాలి ప్రీతీ మృతి సంఘటన రిలీఫ్‌కు సంబంధించి తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చర్చించారు. అలాగే కేసు గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, అడిషనల్ ఎస్పీ గౌతమి శాలి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఐసిడిఎస్ పిడి ప్రవీణ పాల్గొన్నారు.



Next Story

Most Viewed