వినాయక చవితి కి అనుమతి ఇవ్వాల్సిందే : సోము వీర్రాజు

by  |
somu-veerraju
X

దిశ, ఏపీ బ్యూరో: వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికలపై నిర్వహించడానికి వీలు లేదంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించడాన్ని ఏపీ బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. భారతీయ సంస్కృతిలో ముఖ్య భాగమైన విఘ్నాధిపతి వినాయక చవితి నవరాత్రులు స్వాతంత్ర్యం రాక ముందు నుండి బహిరంగ వేదికలపై నిర్వహిస్తున్నామని, ఈ ఆచారం హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. చలువపందిళ్లు వేసి సామూహికంగా వినాయక నవరాత్రులు జరపడం భారతీయుల ఆచారం. కరోనా పేరుతో వినాయక చవితిని వ్యక్తిగతంగా ఇళ్ల వద్దే చేసుకోవాలంటూ, బహిరంగ ప్రదేశాల్లో జరపకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడం మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని..తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిస్తే బాగుండేదన్నారు. అలా కాకుండా ఏకపక్ష నిర్ణయంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ‘కుట్ర కోణం’ దాగి ఉన్నట్లు అనుమానం వస్తోందని సోము వీర్రాజు అన్నారు. కరోనా సమయంలో స్థానికఎన్నికలు నిర్వహించాలని అధికార పార్టీ నేతలు గొంతెత్తి అరిచారని..ఇప్పుడు నిబంధనలు పాటిస్తూ,అన్ని వ్యాపార,వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమాహాళ్ళు పనిచేస్తున్న సంగతిని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ అందిస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వమే కరోనా అదుపులో ఉందని చెబుతూ కేవలం వినాయక చవితి వేడుకులకు మాత్రం కరోనా అఢ్డంకిగా కనపడుతోందా అంటూ ద్వజమెత్తారు.

గురువారం మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలను వేడుకగా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో జరిపిన వైసీపీ ప్రభుత్వం, వినాయక చవితి పండుగ నిర్వహించుకోవడానికి నిబంధనల పేరుతో అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అంటూ మండిపడ్డారు. హిందువుల పండుగలు, దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి విషయాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానం, పలు అనుమానాలకు బలంచేకూరే విధంగా ఉందని మండిపడ్డారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వినాయక చవితి వేడుకలు, చలువ పందిళ్ళు వేసుకుని నిర్వహించుకునే విధంగా అనుమతులు మంజూరు చేయాలని సోము వీర్రాజు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed