ప్రతి గింజను కొనుగోలు చేస్తాం.. వ్యవసాయ శాఖ మంత్రి

by  |
Kursala Kannababu
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలోని 7వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్బులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా ఎంఎస్‌పీ కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 2.36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని రైతులెవరూ ఆందోళన చెందొద్దని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు.

ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు

రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే ఇవాళ ధాన్యాన్ని, ఇతర పంటలను కొనుగోలు చేస్తున్నాం. ఆర్‌బీకేలను కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించాం. ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గించాం. రైతు పంట అమ్ముకోవాలంటే ఆర్‌బీకేలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే..కొనుగోలు కార్యక్రమంతా అక్కడే జరుగుతుంది. 21 రోజుల్లో డబ్బులు అందజేస్తున్నాం. ఎంఎస్‌పీ ఖచ్చితంగా కల్పిస్తున్నాం. అధిక వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా తీవ్రమైన నష్టం జరిగింది. దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటి వరకు వర్షాల కారణంగా ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఎంఎస్‌పీ ప్రకారం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉంటే మొల విరిగిపోతుంది. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది అని మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు.

మెులకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తాం

రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,36,880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇప్పుడే ధాన్యం పెరుగుతోంది. కోతలు పూర్తి అయ్యే సరికి ఇంకా ఎక్కువగా వస్తుంది. 7681 ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయాలని మ్యాపింగ్‌ చేశాం. వచ్చింది వచ్చినట్లు కొనుగోలు చేస్తూ.. ప్రతి ఆర్‌బీకేకు మిల్లులను అనుసంధానం చేశాం. ఇది కాకుండా ఎఫెక్టెడ్‌ ఏరియాలను దృష్టిలో పెట్టుకొని..ఎక్కడైతే వరికి నష్టం వాటిల్లిందో మ్యాపింగ్‌ చేయమని ఆదేశాలు జారీ చేశాం. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించాం. దాదాపు 7 లక్షల టన్నులు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. వరి, బియ్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించాం. నూకల శాతాన్ని ఇంకా ఎక్కువగా అనుమతించాలని జిల్లాల వారీగా డేటాను కేంద్రానికి పంపించామని మంత్రి కన్నబాబు తెలిపారు.

Next Story

Most Viewed