బిర బిరా ‘కృష్ణమ్మ’ ఢిల్లీకి చేరెను

by  |
బిర బిరా ‘కృష్ణమ్మ’ ఢిల్లీకి చేరెను
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాలు ఢిల్లీకి చేరాయి. కృష్ణా జలాల అంశంలో ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోతో జల జగడం మొదలైన విషయం తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు నుంచి ప్రవాహ సామర్థ్యం పెంపునకు ఏపీ నిర్ణయం తీసుకొని పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆ రెండు ప్రాజెక్టుల అంశంలో చర్యలు తీసుకొని ఆపాలని కోరింది. దీనిపై ఏపీ కూడా తెలంగాణపై ఫిర్యాదు చేైసి, కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులకు లేఖలు ఇచ్చింది. బోర్డుల అనుమతి లేకుండా భారీ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారని ఆరోపించింది. దీంతో జల వివాదాలు ముదురుతున్నాయని గుర్తించిన కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు రెడీ అయ్యింది. కానీ సమావేశం ఎప్పుడన్నది ప్రకటించలేదు. అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాత్రం తెలంగాణ, ఏపీతో పాటుగా గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు గురువారం సమాచారం అందించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలశక్తి శాఖ అండర్ సెక్రెటరీ ఏసీ మల్లిక్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశ ఎజెండా కోసం అంశాలను పంపించాలని పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ అంశాలను ప్రస్తావిస్తూ ఎజెండా సిద్ధం చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు. కాగా ఏపీకి తాగునీటి అవసరాలకు సాగర్ కుడి కాల్వ నుంచి 2టీఎంసీల నీళ్లు ఇచ్చే అంశంపై కృష్ణా బోర్డు సమావేశమవుతున్నట్లు ఇవాళ ప్రకటించారు. కానీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉంటుందని కేంద్రం సమాచారం ఇవ్వడంతో బోర్డు సమావేశం నిర్వహిస్తారా… లేదా ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మాట్లాడుకొని సమన్వయంతో సమస్యను పరిష్కరించుకుంటారా… అనే మీమాంస నెలకొంది. వాస్తవంగా 2టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం వాడుకుంటామని ఏపీ గతంలో చాలాసార్లు కోరింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ప్రస్తుతం కృష్ణా జలాల అంశంలోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొనడంతో ఈ అంశంపై కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నది. ఏపీ అభ్యర్థనపై శుక్రవారం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. దీనికోసం సమావేశం నిర్వహిస్తారా… లేదా అనే విషయాన్ని కేఆర్ఎంబీ ప్రకటించలేదు.

Next Story