అనారోగ్యానికి ముందస్తు సంకేతాలు..

by  |
అనారోగ్యానికి ముందస్తు సంకేతాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిరోజు మనం ఉత్సాహంగానే నిద్రలేస్తాం. చలాకీగా అన్ని పనులను చేసుకుంటాం. ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నామని మనకు మనమే అనుకుంటాం. కానీ చలాకీగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగానే ఉన్నట్టా? అంటే కాదు.. ఎందుకంటే మన బాడీలో కనిపించే కొన్ని సంకేతాలు అనారోగ్యాన్ని సూచిస్తాయి. ఆ చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే, పెద్ద అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఇంతకీ ఆ సంకేతాలేంటి?

మొబైల్‌ చార్జింగ్‌ ఉన్నంత సేపు బాగానే ఉంటుంది. కానీ 20 పాయింట్లకు రాగానే, చార్జింగ్‌ అయిపోతోంది అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. అలాగే మానవ శరీరం కూడా మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. కానీ మనమే పని ఒత్తిడిలో పడి, వాటిని సరిగ్గా గమనించం. అస్సలు పట్టించుకోం. అప్పుడు సరైన ఆహారం తీసుకోకుంటే ఆ ప్రభావం శరీరంపై వెంటనే చూపిస్తుంది. అందుకే ఆరోగ్యం విషయంలో శరీరం ఇచ్చే సంకేతాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా కొన్ని విషయాల్లో కోపం, చిరాకు రావడం సహజం. కానీ అవి విపరీతమైన పని వల్లనో లేక ఇంట్లోని టెన్షన్స్ వల్లనో వచ్చి ఉంటాయని పొరపాటు పడుతుంటాం. కానీ అవి కూడా అనారోగ్యానికి సూచికలు. శరీరానికి సరిపడా కార్బోహైడ్రేట్లు అందకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో త్వరగా చిరాకు, కోపం వస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న అరటి పండు, బంగాళదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కొంతమందికి నోటీ దుర్వాసన వేధిస్తుంటుంది. దీనికి కారణం నోరు సరిగ్గా కడుక్కోకపోవడమో, బ్రష్ సరిగ్గా చేయకపోవడమో అనుకుంటారు. కానీ రీజన్ అది కాదు. శరీరంలో సరిపడా గ్లూకోజ్ లేకపోతే ఇలా నోటి దుర్వాసన వస్తుంది. శరీరంలో సరైన స్థాయిలో గ్లూకోజ్ లేకపోతే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు పదార్థాలు కరుగుతాయి. దీంతో కీటోన్స్, ఎంజైమ్స్ విడుదలవుతాయి. దీనివల్ల కేటోసస్ అనే మెటబాలిక్ ప్రాసెస్ జరిగి నోటి దుర్వాసనకు దారితీస్తుంది. చలికాలంలో పెదాలు పగలడం సర్వసాధారణం. కానీ కొందరికి ఇతర కాలాల్లోనూ పెదాలు పగులుతుంటాయి. కొందరు ఒంట్లో వేడి వల్ల ఇలా జరుగుతుందని లైట్ తీసుకుంటారు. కానీ మన శరీరంలో ఐరన్ లోపించడం వల్ల ఇలా జరుగుతుంది. రాను రాను ఈ సమస్య మరింత పెరిగి నోటి అల్సర్‌కు దారి తీయొచ్చు. శరీరంలో ఐరన్ తగ్గిందనే ఈ సంకేతాన్ని మొదట్లోనే అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి.

తరచుగా మూత్రానికి వెళ్లడం కూడా మన శరీరం అందించే ఓ సంకేతమే. అయితే నీళ్లు ఎక్కువ తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుందని, తమకు మూత్రం చాలా సాఫ్‌గా ఉందని, తమకు ఏ రోగం లేదని అనుకుంటారు. కానీ బాడీలో చక్కెర నిల్వలు పెరగడం వల్లే ఈ సమస్య వస్తుంది. దీనికి తోడు శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, యూరినల్ బ్లాడర్ పనితీరు డిస్టర్బ్ అవడం వల్ల కూడా పదే పదే మూత్రం వస్తుంది. ఇది భవిష్యత్తులో మూత్ర పిండాల వ్యాధికి దారి తీయొచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా డాక్టర్‌ను కన్సల్ట్ కావడం బెటర్.

అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, నిత్యం అలసిపోయి ఉండటం, గురక పెట్టడం, చర్మంపై హఠాత్తుగా ర్యాషెస్ రావడం, కళ్లు మసకబారినట్లు కనిపించడం, నాలుక ఎరుపెక్కడం ఇవన్నీ కూడా శరీరమందించే కొన్ని సంకేతాలే. ఇలా మన శరీరం.. ‘హలో! కాస్త ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ హెచ్చరికలు పంపిస్తూ ఉంటుంది. ఇక నుంచైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కాస్త జాగ్రత్త పడి, పెద్ద అనారోగ్య సమస్యల నుంచి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం.



Next Story

Most Viewed