Warangal Commissionerate : సేవలు ఘనం.. ‘సరెండర్స్’ శూన్యం.. ఆర్థిక కష్టాల్లో కానిస్టేబుళ్లు!

by  |
warangal commisionarate
X

దిశ‌ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో స‌రెండ‌ర్స్ చెల్లింపులు నిలిచిపోయాయి. క‌ష్టార్జితం కోసం ఐదు నెల‌లుగా క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని దాదాపు 3వేల మంది సిబ్బంది ఎదురు చూస్తున్నారు. పోలీసుల అద‌న‌పు సేవ‌ల‌కు గుర్తింపుగా.. రాష్ట్ర ప్రభుత్వం అద‌న‌పు భ‌త్యాల‌ను(స‌రెండ‌ర్స్‌) చెల్లిస్తూ వ‌స్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ స‌జావుగానే సాగుతుండ‌గా.. క‌మిష‌న‌రేట్ పరిధిలోని సిబ్బంది పే స్లిప్పుల‌ను ప‌రిశీలించే అకౌంట్స్ విభాగం వైఫ‌ల్యంతోనే జ‌న‌వ‌రిలో అందాల్సిన స‌రెండ‌ర్స్ మొత్తం నేటికి అంద‌లేద‌ని తెలుస్తోంది. మే నెల జీతంతోనైనా వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డిన కానిస్టేబుళ్లకు నిరాశే ఎదురైంది. ఇప్పుడు జూన్ నెల జీతంతోనైనా స‌రెండ‌ర్స్ మొత్తాన్ని క‌లిపి ఇస్తార‌నే కొండంత ఆశ‌తో ఎదురు చూస్తున్నారు.

Warangal Police Commissioner orders compulsory weekly off for staff at  police station

క‌మిష‌న‌రేట్ పరిధిలో ప్రతీసారి లేటే..

రాష్ట్ర ప్రభుత్వం స‌రెండ‌ర్స్ మొత్తాన్ని మూడు విడ‌తలుగా అంద‌జేస్తూ వ‌స్తోంది. పోలీస్‌శాఖ సిబ్బందికి 12 నెల‌ల జీతంతో పాటు అద‌నంగా 45 రోజుల‌కు జీతం చెల్లిస్తోంది. జ‌న‌వ‌రి, జూలై, న‌వంబ‌ర్ మాసాల్లో 15 రోజుల చొప్పున అద‌న‌పు జీత‌భ‌త్యాల‌ను లెక్కగట్టి ఇస్తుంది. ఆ స‌మ‌యంలో లీవ్‌లో ఉన్నా.. సిక్‌లో ఉన్నా.. ఈ మొత్తాన్ని క‌ట్ చేసి అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. అయితే గ‌త సంవ‌త్సరం న‌వంబ‌ర్లో అంద‌జేయాల్సిన స‌రెండ‌ర్స్ మొత్తాన్ని ఈ సంవ‌త్సరం జ‌న‌వ‌రిలో సిబ్బందికి అంద‌జేశారు. అయితే, జ‌న‌వ‌రిలో అంద‌జేయాల్సిన స‌రెండ‌ర్స్ మొత్తానికి మాత్రం ఇంతవ‌ర‌కు అతీగ‌తీ లేద‌నే చెప్పాలి. ఈ మొత్తాన్ని అంద‌జేయ‌డంలో ప్రతీసారి అకౌంట్స్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యమే కార‌ణంగా తెలుస్తోంది. కేవ‌లం సిబ్బంది జాప్యం వ‌ల‌నే 3 వేల మంది పోలీసులకు ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని కానిస్టేబుళ్లు పేర్కొంటున్నారు.

కానిస్టేబుళ్లకు ఆర్థిక క‌ష్టాలు..

స‌రెండ‌ర్స్ స‌మ‌యానికి రాక‌పోవ‌డంతో పోలీస్‌ శాఖ‌లోని కిందిస్థాయి సిబ్బంది ఆర్థిక క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నారు. వ‌రంగ‌ల్ అర్భన్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ప‌నిచేస్తున్న దాదాపు 150 మందికి పైగా సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. క్యారియ‌ర్లుగా మార‌డంతో వారితో పాటు కుటుంబ స‌భ్యులు మ‌హ‌మ్మారి సోకింది. దీంతో అనేక కుటుంబాలు ఆస్పత్రి పాలై ల‌క్షల రూపాయ‌లు ఖ‌ర్చు చేసుకున్నామ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. క‌రోనా లాంటి విప‌త్కర ప‌రిస్థితుల్లో ప‌నిచేస్తున్నా.. పోలీస్ సిబ్బందికి అందాల్సిన జీత‌భ‌త్యాల విష‌యంలో ఆల‌స్యం జ‌రుగుతుండ‌టంపై క‌మిష‌న‌ర్ త‌రుణ్ జోషి స్పందించి చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతున్నారు. రోజంతా అత్యంత ప్రమాద‌క‌ర ప‌రిస్థితుల్లో కూడా విధుల‌ను నిర్వహిస్తున్న సిబ్బందిలో చాలా మంది కుటుంబాల‌కు దూరంగా ఉంటున్నారు. క‌రోనా క్యారియ‌ర్లుగా మారుతామ‌నే భ‌య‌మే వారిని కుటుంబాల‌కు దూరంగా ఉంచుతోంది. కొంత‌మంది నెల‌ల త‌ర‌బ‌డి ఇంట్లో వారికి దూరంగా ఉంటున్నామ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed