అవయవాలు కావలెను.. ప్లీజ్ దానం చేయండి!

by  |
Organ Transplant
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ప్రభావంతో చాలా మందికి ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. ఈ వైరస్ నేరుగా లంగ్స్ పై దాడి చేయడంతో కొందరు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా లంగ్స్ ప్రాబ్లామ్స్ వస్తున్నాయి. దీంతో వీటి పనితీరు సరిగ్గా లేని వారు అవయవ మార్పిడీ కొరకు ట్రై చేస్తున్నారు. కానీ కరోనా నేపథ్యంలో డోనర్లు ముందుకు రావడం లేదని జీవన్ దాన్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ట్రాన్స్ ప్లాంటేషన్ కొరకు ఆన్‌లైన్‌లో ఆప్లై చేసిన బాధితులు అవయవాల కొరకు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే డోనర్ల కోసం ఇతర రాష్ర్టాల్లో ప్రయత్నించినా దొరకడం లేదని స్వయంగా ఆఫీసర్లు చెబుతున్నారు.

ఈనెల 9 తేది వరకు జీవన్ దాన్ సంస్థలో 60 ఊపిరితిత్తులు,1733 కిడ్నీలు, కాలేయం 631, గుండె 35, క్లోమం కొరకు 8 దరఖాస్తులు నమోదయ్యాయి. కానీ కొవిడ్ సోకి మరణించిన వారి నుండి అవయవాలను సేకరించే పరిస్థితులు లేనందున కొవిడ్ కాలంలో సుమారు 40 శాతం పైగా అవయవదానాలు తగ్గాయి.

గడిచిన 8 ఏళ్లలో 3369 దానాలు

2013 నుంచి 2021 వరకు జీవన్ దాన్ సంస్థ ద్వారా 888 మంది డోనర్ల నుంచి 3369 అవయవాలను మార్పిడీ చేశారు. వీటిలో కిడ్నీలు 1360, లివర్ 832, హార్డ్ 131, కార్నీయాస్ 779, హార్డ్ వాల్వ్‌లు 170, లంగ్స్ 86, పదకొండు ప్రాంకియస్ మార్పిడీలు జరిగినట్లు జీవన్ దాన్ సంస్థ అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 13 న అవగాహన దినోత్సవం

ప్రతీ సంవత్సరం ఆగస్టు 13వ తేదిన ప్రపంచ అవయవ దాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అవయవదానంపై ప్రజలల్లో అవగాహన కలిపించడానికి జీవన్ దాన్‌తో పాటు పలు స్వచ్ఛంధ సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. హాస్పిటళ్లు, కమ్యూనిటీ హాళ్లు తదితర ప్రదేశాల్లో అవగాహన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం సనత్ నగర్ రెనోవా హాస్పిటల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీవన్ దాన్ ఇన్‌ఛార్జీ డాక్టర్ జి.స్వర్ణలత, రెనోవా హాస్పిటల్ చీఫ్ ఆఫీసర్ శాంతి పాల్గొన్నారు.

అవగాహన లేమితో అవయవాలు దొరకడం లేదు

అవయవదానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతోనే అవయవాలు దొరకడం లేదు. ప్రస్తుతానికి కిడ్నీ, లివర్ వంటి కొన్ని అవయవాలను బతికి ఉన్న వారి నుండి సేకరించగలుగుతున్నాం. అయితే గుండె, ఊపిరితిత్తులు వంటి పలు కీలక అవయవాలను బ్రెయిన్ డెడ్ వారి నుండి మాత్రమే సేకరించాల్సి వస్తుంది. ఇలా బ్రెయిన్ డెడ్ వారి నుండి అవయవాలు సేకరించే విషయంపైనే ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కలిపించాల్సి పరిస్థితి ఉన్నది. అయితే రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బందితో అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నాం.
-డాక్టర్ స్వర్ణలత, జీవన్ దాన్ సంస్థ

Next Story

Most Viewed