ఆ నలుగురి ఫలితాల కోసం వెయిటింగ్..

by  |
ఆ నలుగురి ఫలితాల కోసం వెయిటింగ్..
X

– వాటితోనే ఖమ్మంలో కొవిడ్-19 భవితవ్యం

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో నాలుగు రోజులుగా నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులు న‌మోదు కాలేదు. కాని పొరుగున ఉన్న సూర్యాపేట జిల్లాలో అనుహ్యంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. అక్క‌డి నుంచి ఓ కారు డ్రైవ‌ర్‌ సాయంతో ముగ్గురు ప్ర‌భుత్వ అధికారులు జిల్లాకు రాక‌పోక‌లు సాగించిన‌ట్లుగా వైద్యాధికారులు గుర్తించారు. సూర్యాపేట ఎంపీడీవోగా విధులు నిర్వ‌హిస్తున్న అధికారితో పాటు డిప్యూటీ సీఈవో స్థాయి అధికారి, ఓ రెవెన్యూ అధికారి కలిసి ముగ్గురు ఒకే కారులో రోజూ ఖమ్మం నుంచి సూర్యాపేటలో విధులకు హాజరయ్యారు. గ‌త గురువారం సూర్యాపేట ఎంపీడీవో కార్యాల‌యంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ఖ‌మ్మం జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. కారు డ్రైవ‌ర్‌తో పాటు ముగ్గురు అధికారుల‌ను వైద్యులు ప్ర‌స్తుతం క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఇందులో ఎంపీడీవోను ప్రైమ‌రీ కాంటాక్టు అనుమానిత కేసు కింద సూర్య‌పేట‌లోని ఆస్ప‌త్రిలోని ఐసొలేషన్ వార్డుకు త‌ర‌లించారు. మిగ‌తా ముగ్గురిని ఖ‌మ్మం జిల్లా ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డు క్వారంటైన్‌లో ఉంచారు. వీరంద‌రి కొవిడ్ 19 ప‌రీక్ష ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

జిల్లాలో గత నాలుగు రోజులు గా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. ప్రైమరీ, సెంకడరీ కాంటాక్టుల క్వారంటైన్‌ సమయం పూర్తికావ‌డంతో ఇక క‌రోనా గండం నుంచి జిల్లా బ‌య‌ట‌ప‌డిన‌ట్లేన‌ని భావిస్తున్న త‌రుణంలో అధికారుల జ‌ర్నీ హిస్ట‌రీ యంత్రాంగంలో క‌ల‌వ‌రం రేపుతోంది. అనుమానితులంతా ఉన్నతాధికారులు కావడంతో పాటు వీరి నివాసాలు సైతం ఖమ్మం ప‌ట్ట‌ణంలోని ముఖ్య‌మైన కూడ‌ళ్ల‌కు ఆనుకుని ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. వీరికి పాజిటివ్ నిర్ధార‌ణ అయితే ఖమ్మంలో కరోనా మహమ్మారి విస్తరించేందుకు అవకాశం ఉందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

దారుల‌ మూసివేత..

సూర్యాపేట జిల్లా నుంచి ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చేరుకునే అన్ని మార్గాల‌ను అధికారులు పూర్తిగా మూసివేశారు. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశాల మేరకు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీకేంద్రం వద్ద భద్రతను మరింత పెంచారు. సూర్యాపేట జిల్లా పరిసర గ్రామాల నుంచి ప్ర జలు రాకుండా రహదారులు మూసివేశారు. ఉర్లుగొండ, రామచంద్రాపురం, విభళాపురం, కోదాడ గ్రామాలకు వెళ్లే రహదారులపై రాక‌పోక‌లు సాగించ‌కుండా అధికారులు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. నాయకన్‌గూడెం ర‌హ‌దారుల‌పై కంచె కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఖమ్మం జిల్లాలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags: Covid 19 positive cases, spreading, khammam, four persons, travel history

Next Story

Most Viewed