అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన ఇండియన్ ఆర్ట్ ఇదే

by  |
అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన ఇండియన్ ఆర్ట్ ఇదే
X

న్యూఢిల్లీ : ఇండియన్ ఆర్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉన్నది. కానీ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహంచే వేలంలో మన దేశానికి చెందిన పెయింటింగ్‌లు ఆ స్థాయిలో ధర పలకవు. భారీ ధరకు అమ్ముడుపోయిన భారతీయ పెయింటింగ్‌లు అరుదు. అలాంటిది కరోనా సంక్షోభ సమయంలోనూ ఈ నెలలో నిర్వహించిన ఓ వేలంలో భారత పెయింటింగ్‌ రికార్డు ధరను పలికింది. సాఫ్రన్ ఆర్ట్ స్ప్రింగ్ లైవ్‌ ఈ నెల 11న నిర్వహించిన వేలంలో ప్రముఖ ఆర్టిస్ట్ వీఎస్ గాయ్‌తోండే కాన్వస్‌పై వేసిన పెయింటింగ్ రూ. 39.98 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. వీఎస్ గాయ్‌తోండే పెయింటింగ్‌లలోనే కాదు, భారత ఆర్ట్ చరిత్రలోనూ ఇది గరిష్ట ధర. గతంలోనూ ఈ రికార్డు వీఎస్ గాయ్‌తోండే పేరిటే ఉన్నది. 2020 సెప్టెంబర్‌లో గాయ్‌తోండే వేసిన ఓ పెయింటింగ్ 36.8 కోట్లకు అమ్ముడుపోయింది.

వీఎస్ గాయ్‌తోండే యువకుడిగా ఉన్న 1960లలో అప్పటి బొంబాయ్‌లోని తన స్టూడియో వెలుపల కూర్చుని సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తుండేవారు. కడలి లోతుల్లో చిక్కుకుని గంటలు గడిపేవారు. తదేకంగా చూస్తూ ఒక తపో అనుభవాన్ని పొందుతుండేవారు. అదే అనుభూతి తన పెయింటింగ్‌లోకీ ఒంపారు. 1961లో వేసిన ఈ పెయింటింగ్‌ కూడా సముద్రాన్ని ఒక లోతైన దృష్టితో చూపిస్తున్నది. 50X80 ఇంచుల వైశాల్యంతో వేసిన ఈ చిత్రానికి పేరుపెట్టలేదు. ఇండియన్ అబ్‌స్ట్రాక్ట్ పెయింటర్ వీఎస్‌పై జెన్ ఫిలాసఫీ ప్రభావమున్నది.

బహిరంగం వేలంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్ లియోనార్డో డావిన్సీ పేరిట ఉన్నది. ‘మోనాలిసా’ చిత్రకారుడు డావిన్సీ వేసిన సాల్వేటర్ ముండి 2017లో 450.3 డాలర్లకు అమ్ముడుపోయింది. కాగా, భారత పెయింటింగ్‌లు మిలియన్ డాలర్ల మార్కును ఇటీవలి సంవత్సరాల్లోనే దాటాయి. 2002లో తయ్యబ్ మెహెతా చిత్రం రూ. 1.5 కోట్లకు విక్రయమై భారత పెయింటింగ్‌లకు నూతన ఉత్తేజాన్నిచ్చింది. అప్పటి నుంచి ఎస్‌హెచ్ రజా, రాజా రవివర్మ, ఎఫ్ఎన్ సౌజా లాంటి ప్రసిద్ధ భారత చిత్రకారులు ఈ ఫీట్‌ను అందుకున్నారు.

Next Story

Most Viewed