గ్రాడ్యుయేట్ల వెతలు: ఇల్లు ఓచోట.. ఓటు మరోచోట

by  |
Graduate MLC Election poling
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: పాతబోయిన్‌పల్లికి చెందిన రైల్వే ఉద్యోగి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్యతో కలిసి ఒకే రోజు ఓటు నమోదు చేసుకున్నాడు. అయితే ఎన్నికల విభాగం తనకు బాలానగర్‌లో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించగా, తన భార్యకు మాత్రం ఓల్డ్‌బోయిన్ పల్లిలో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించింది. దీంతో ముందుగా తన భార్యతో ఓటు వేయించి ఆ తర్వాత బాలానగర్ వెళ్లి తాను ఓటు వేయాల్సి వచ్చింది.

– ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసే ఇద్దరు భార్యభర్తలు ఒకే రోజున తమ ఓటు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో ఒక్కరికి కుత్బుల్లాపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని కేటాయిస్తే.. మరొకరికి సనత్‌నగర్‌లో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. వీరిద్దరు ఓటు వేసేందుకు ఉదయం 9గంగలకు వెళ్తే.. మధ్యాహ్నం 3గంటలకు ఇల్లు చేరుకోవాల్సి వచ్చింది. ఇలా ఎంతోమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎండలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను అధికార యంత్రాంగం అపహాస్యం చేసింది. మండుటెండలో గ్రాడ్యుయేట్ ఓటర్లను తీవ్ర అవస్థల పాలు చేసింది. ఒకే ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఓట్లను వేర్వరు చోట్లకు మార్చేసింది. ఓటు హక్కును వినియోగించుకోవాలనుకున్న పట్టభద్రుల ఆశలను నీరు గార్చేలా చేసింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం.. పట్టింపులేని తనం వల్ల పోలింగ్ రోజున ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకే అధిక సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఒకే ఇంట్లో నివసిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులను వేర్వేరు ప్రాంతాల్లోకి మార్చడంతో… కుటుంబంలోని నలుగురు నాలుగు చోట్లకు వెళ్లి ఓటు వేయాల్సి వచ్చిందని పలువురు ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.

గ్రాడ్యుయేట్ల వెతలు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏ పోలింగ్ కేంద్రంలో చూసిన భారీ క్యూలు కన్పించడంతో తమ ఓటు వినియోగించుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. పలు పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లకు టాయిలెట్లు లేవు, పలు కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించలేదు. కొన్ని కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించినా ఎండకు వాటర్ క్యాన్లను పెట్టడంతో వేడి నీరు తాగలేక ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా పాతబోయిన్‌పల్లిలోని 447 పోలింగ్ కేంద్రం ఇరుకుగా ఉండడంతో ఓటు వేసేందుకు చాలా సమయం తీసుకుంది. ఆ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు కూర్చునేందుకు, సిబ్బందికి ఊపిరి అడని పరిస్థితి నెలకొంది.

వెనుదిరిగిన ఓటర్లు..

తాము నివాసం ఉన్న చోట కాకుండా వేరే దూర ప్రాంతంలో పోలింగ్ కేంద్రం కేటాయించడంతో చాలా మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు విముఖత చూపారు. దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తమ ఓటు ఇక్కడ లేదని తెలుసుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అదేవిధంగా తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పలువురు ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమ కాలనీలోని ఓట్లన్నీ గల్లంతయ్యయాని వాపోయారు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేసినా.. తమ ఓట్లను తీసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలింగ్ అధికారులను నిలదీశారు. అయితే పోలింగ్ అధికారులు ఈసారి మీరు ఓటును రెన్యూవల్ చేసుకున్నారా..? అని ప్రశ్నించగా, తాము చేసుకోలేదన్నారు. అయినా.. తాము స్థిర నివాసంలోనే ఉంటున్నామని, ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటు వేశామని, పట్టభద్రుల ఎన్నికకు రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరమేముందని ఎన్నికల సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు.

భార్యాభర్తలది తలో చోట..

మేము ఇద్దరం ఒకేసారి ఓటు నమోదు చేసుకున్నాం. అడ్రస్ ఒక్కటే ఉంది. కానీ నా భార్యకు పాతబోయిన్‌పల్లిలో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. నాకు మాత్రం బాలానగర్‌లో కేంద్రాన్ని కేటాయించారు. దీంతో మేం చాలా ఇబ్బంది పడ్డాం. నా భార్య ఓటు వేసేంతవరకు 2గంటల పాటు వేచి చూసి ఆమెను ఇంటి వద్ద దింపి నేను బాలానగర్‌కు వెళ్లి ఓటు వేయాల్సి వచ్చింది. ఒకే చోట పోలింగ్ కేంద్రాన్ని కేటాయిస్తే ఇబ్బందులు పడేవాళ్లం కాదు. ఎన్నికల విభాగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారించడం తగదు. – శ్రీనివాసాచారి, రైల్వే ఉద్యోగి

ఇల్లు ఓచోట.. ఓటు మరోచోట

మా సొంత ఇల్లు ఉండేది కుషాయిగూడలో కానీ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాన్ని పాత బోయిన్‌పల్లిలో కేటాయించారు. ఇదేక్కడి న్యాయం. పాత బోయిన్‌పల్లిలో తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రం జాడ తెలుసుకొని ఓటు వేసేటప్పటికి 5గంటల సమయం పట్టింది. అయితే మా ఇంటి పక్కనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఓటు వేసుకోనే అవకాశాన్ని కల్పించలేకపోవడం బాధాకరం. – ప్రకాష్, గ్రాడ్యుయేట్ ఓటరు


Next Story

Most Viewed