నల్లమల్లలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్

by  |
నల్లమల్లలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్
X

దిశ, అచ్చంపేట: నల్లమల్ల ఏజెన్సీ ప్రాంతంలో గత పది రోజులుగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండల కేంద్రాలలో స్వచ్ఛందంగా వ్యాపారస్తులు ముందస్తు జాగ్రత్తగా లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. అచ్చంపేట పట్టణంలో గడిచిన నాలుగు రోజులుగా బంద్ కొనసాగుతుండగా పదరా, అమ్రాబాద్ మండలాలలో నేటి నుంచి ఈ నెల 27 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ఆయా గ్రామ పంచాయితీ సర్పంచులు, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గడిచిన వారం రోజుల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 22 కేసులు నమోదు కావడంతో నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు నమోదైన గ్రామాలలో వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, సర్పంచులు, పోలీసులు ముందు వరుసలో నిలబడి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆందోళన చెందకుండా రక్షణ నివారణ చర్యల్లో భాగంగా శానిటైజ్, మురికి కాల్వల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న అంతమాత్రాన ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దని వ్యక్తిగత శుభ్రతతో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం మరచి పోవద్దని వైద్యులు సూచనలు చేస్తున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు మరింతగా ఉన్నాయని చెప్పవచ్చు. అంతమాత్రాన సహజంగా వచ్చే జ్వరం, దగ్గు , తలనొప్పి ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తులలో కరోనా వ్యాప్తి చెందిందని ఆందోళన పడవద్దని వైద్యులు సూచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ గోరువెచ్చని నీటిని తప్పక తీసుకోవాలని రోజుకు ఏడెనిమిది సార్లు చేతులను శుభ్రం చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి నల్లమల్ల ప్రాంతంలో వ్యాప్తి చెందకుండా ముందే ఈ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు.



Next Story

Most Viewed