ధ్వంసమైన మొక్కలను పరిశీలించిన ఏపీఓ

by Ratna Kumari |

లింగంపేట మండలం పర్మల్ల గ్రామ శివారులోని ప్లాంటేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన మొక్కలను సోమవారం ఈజీఎస్ ఏపీఓ నరేందర్ పరిశీలించారు.

ధ్వంసమైన మొక్కలను పరిశీలించిన ఏపీఓ
X

దిశ, లింగంపేట : లింగంపేట మండలం పర్మల్ల గ్రామ శివారులోని ప్లాంటేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన మొక్కలను సోమవారం ఈజీఎస్ ఏపీఓ నరేందర్ పరిశీలించారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ధ్వంసం కావడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఓ నరేందర్ మాట్లాడుతూ.. గ్రామ శివారులో ఈజీఎస్ నిధులతో సుమారు వెయ్యి మొక్కలు నాటగా, వాటిలో దాదాపు 350 మొక్కలు ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. ఎంపీడీవో బ్రహ్మానందం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను సమర్పించనున్నట్లు చెప్పారు.

ఘటనపై ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా..

పర్మల్ల గ్రామ శివారులోని సుమారు 8 ఎకరాల అటవీ భూమిలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన ఘటనపై ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. అటవీ భూములను ఆక్రమించుకునే ఉద్దేశంతోనే మొక్కలను ధ్వంసం చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అలాగే అటవీ భూమిలో జరిగిన ఈ ఘటనపై అటవీశాఖ తీసుకున్న చర్యలపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పోలీసులకు ఫిర్యాదు..

మొక్కలు ధ్వంసమైన విషయాన్ని తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి నరేష్, సర్పంచ్ గడ్డం బాబాయి నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆగపల్లి తండాకు చెందిన ధరావత్ శివలాల్, ధరావత్ మున్యా, ధరావత్ పూల్‌సింగ్, ధరావత్ వినోద్, కడావత్ సవాయి తదితరులు కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్‌పై దాడికి యత్నించారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై దీపక్ కుమార్‌ను వివరణ కోరగా, ఫిర్యాదు అందిన విషయం వాస్తవమేనని, కేసును విచారించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story