రూ. 3 వేల కోట్లు చెల్లించిన వొడాఫోన్ ఐడియా!

by  |
రూ. 3 వేల కోట్లు చెల్లించిన వొడాఫోన్ ఐడియా!
X

దిశ, వెబ్‌డెస్క్ : టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా టెలికాం విభాగానికి సర్దుబాటు చేసిన స్థూల రాబడి(ఏజీఆర్) చెల్లింపుల్లో భాగంగా మరో రూ. 3,042.80 కోట్లు చెల్లించింది. గత నెలలో, వొడాఫోన్ ఐడియా తన ఏజీఆర్ బకాయిల్లో భాగంగా మొత్తం రూ. 3,500 కోట్లు చెల్లించింది. వొడాఫోన్ ఐడియా టెలికాం విభాగానికి మొత్తం రూ. 53,000 కోట్లు చెల్లించాలి. ఇందులో, స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 24,729 కోట్లు, ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజులో భాగంగా రూ. 28,309 కోట్లు.

ఏజీఆర్ బకాయిలకు సంబంధించి పలుమార్లు కోర్టుకెళ్లిన వొడాఫోన్ ఐడియా చెల్లింపుల నుంచి మినహాయింపుని సాధించలేకపోయింది. సంస్థలో సుమారు 13,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగులున్నారు. ఏజీఆర్ సంక్షోభం కారణంగా తమ వ్యాపారాన్ని కొనసాగించడంపై వొడాఫోన్ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మరో సంస్థ, భారతి ఎయిర్‌టెల్ తన వాయిదా వేసిన స్పెక్ట్రమ్ బకాయి రూ .1,950 కోట్లు టెలికాం విభాగానికి చెల్లించింది. ఎయిర్‌టెల్ చెల్లించాల్సిన మొత్తం రూ. 35,586 కోట్లు. గత నెలలో ఏజీఆర్ బకాయిల్లో భాగంగా రూ. 8,004 కోట్లను చెల్లించింది. రిలయన్స్ జియో 1,053 కోట్ల రూపాయలు చెల్లించింది. అలాగే, టాటా టెలీ సర్వీసెస్ రూ. 2,197 కోట్లను చెల్లించింది.

టెలికాం విభాగం ప్రకారం..మొత్తం 15 సంస్థలు ప్రభుత్వానికి రూ. 1.47 లక్షల కోట్లు చెల్లించాలి. ఇందులో లైసెన్స్ ఫీజు కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల కింద రూ. 55,054 కోట్లుగా ఉంది. ఇందులో చెల్లింపుల ఆలస్యం, వడ్డీ, పెనాల్టీ అన్నీ కలిపి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలే 60 శాతం వాటా కలిగి ఉన్నాయి.

Next Story