భయం.. భయం.. ‘వైద్య శాఖ’కు వైరస్‌ గండం

by  |
భయం.. భయం.. ‘వైద్య శాఖ’కు వైరస్‌ గండం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నాడు స్వైన్ ఫ్లూ.. నేడు కరోనా.. రెండూ రాష్ట్రాన్ని, దేశాన్ని గడగడలాడించాయి. ఇలాంటి వైరస్‌ల విజృంభణ వేళా.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రులకు పదవీ గండం రావటం కొసమెరపు. వైరస్‌ కొనసాగుతున్న సమయంలోనే వరుసగా రెండు సార్లు వైద్యారోగ్య శాఖ మంత్రుల పదవులు ఊడిపోవటంతో ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారు.

ఆరున్నరేళ్ల క్రితం రాజయ్య రాజీనామా

గతం(2014)లో స్వైన్ ఫ్లూ వీర వీహారం చేస్తున్న వేళ తాటికొండ రాజయ్య ఆరు నెలల్లోపే వైద్యారోగ్య శాఖ మంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే.. ఆయన పదవి రాజీనామా చేయటానికి కారణాలు వేరే ఉన్నప్పటికీ.. ప్రధానంగా స్వైన్ ఫ్లూను నియంత్రించటంలో పూర్తి వైఫల్యం చెందారనే కారణాలతోనే.. వైద్యారోగ్య శాఖతో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించారు. ఒక దశలో బర్తరఫ్ చేస్తారనే సంకేతాలు వెళ్లగా.. ఆయనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ శాఖకు మంత్రిగా సి.లక్ష్మారెడ్డిని నియమించారు. మరో ఎన్నికల వరకు ఆయనే కొనసాగారు. కానీ, రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం కేబినెట్‌లో అవకాశమే రాలేదు.

కరోనా సమయంలో ఈటల..

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది. భూకబ్జా ఆరోపణలు రావడంతో వైద్యారోగ్య శాఖ పదవిని సీఎం కేసీఆర్‌కు బదలాయింపు చేస్తూ.. గవర్నర్ తమిళి సై ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విచారణకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ కొనసాగుతుండగానే ఈటల మంత్రి పదవిని కోల్పోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారం స్వరాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, మరోసారి వైద్యారోగ్య శాఖ మంత్రిగా సి.లక్ష్మారెడ్డిని నియమిస్తారనే ప్రచారం సాగుతోంది.

కారణం ఏదైనా పదవులు పోయే..

అప్పుడు స్వైన్ ఫ్లూ, ఇప్పుడు కరోనా వైరస్ విజృంభణ సమయంలోనే స్వరాష్ట్రంలో ఇద్దరు వైద్యారోగ్య శాఖ మంత్రులకు పదవీ గండం రావటం గమనార్హం. కారణాలు ఏమైనా.. రెండింటి పరిణామాలు ఒకేలా ఉండటం ఆలోచించాల్సిన విషయం. ఈ పరిణామాలతో వైద్యారోగ్య శాఖ ఎవరికి అచ్చి రావటం లేదనే సెంటిమెంటు తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది.



Next Story