కొహ్లీ నిజంగా 'పాతాల్ లోక్' చూశాడా..?

by  |
కొహ్లీ నిజంగా పాతాల్ లోక్ చూశాడా..?
X

దిశ, స్పోర్ట్స్ :

ఇప్పుడంతా ఓవర్ ది టాప్ (ఓటీటీ)ల కాలం. కరోనా సంక్షోభ సమయంలో సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ యాప్స్ (ఓటీటీ)అను ఆశ్రయిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5, సన్ నెక్ట్స్, ఆహా వంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకొని వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే.. సినిమాల కంటే వెబ్ సిరీస్‌లు చూడటానికే ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా అలవాటు పడ్డారు. దీంతో వెబ్ సిరీస్‌లు రిలీజ్ చేసిన ప్రతీసారి ఆయా ఓటీటీలు ప్రమోషన్లు భారీగా చేసుకోవాల్సి వస్తోంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5లు పోటాపోటీగా వెబ్ సిరీస్‌లు విడుదల చేస్తున్నాయి. ఇటీవల ప్రైమ్ విడుదల చేసిన ‘పాతాల్ లోక్’ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. అయితే ‘పాతాల్ లోక్’ విడుదలైన మూడు రోజుల్లోనే కొహ్లీ దీనిపై స్పందించాడు. అంతే కాదు కొహ్లీ భార్య అనుష్క శర్మ కూడా పాతాల్ లోక్ సిరీస్ చూడమంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది. అక్కడే అభిమానులకు అనుమానాలు మొదలయ్యాయి. 9 ఎపిసోడ్లుగా సాగిన ఈ పాతాల్ లోక్ 6 గంటల పైగా నిడివి ఉండగా.. వీళ్లిద్దరూ అంత సేపు కూర్చొని సిరీస్ చూశారా. ఇప్పుడిప్పుడే సామాన్య ప్రేక్షకులు చూస్తుంటే.. వీళ్లు అంత ముందుగా ఎందుకు స్పందించారని అంటున్నారు. దీనిపై ముంబైకి చెందిన ఒక పీఆర్ ఏజెన్సీ మాట్లాడుతూ.. సినిమా, సీరియల్, వెబ్ సిరీస్.. దేనికైనా పబ్లిసిటీ అవసరమని.. సెలెబ్రిటీలు చూస్తే చూస్తారేమో కానీ ఒక ప్రొడక్ట్ గురించి అంత త్వరగా స్పందించరు. స్పందిస్తే అది కచ్చితంగా ప్రమోషన్ గానే గుర్తించాలని చెప్పారు. కొహ్లీ చూసి ఉండచ్చేమో కానీ.. అందరూ ఇలా చూసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టరని చెప్పారు. అయితే ఇంతకు కొహ్లీ చూసి పెట్టాడా లేదా ప్రమోషన్ కోసం పెట్టాడా అనేది మాత్రం తేలలేదు.

Next Story

Most Viewed