మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు

by  |
మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు
X

దిశ, వాజేడు: మోస్తారు వర్షాలతో ఏజెన్సీ ఏరియాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మన్యం ప్రాంతంలో ఇంటికి ఇద్దరు చొప్పున మంచాన పడుతున్నారు. సకాలంలో ప్రభుత్వ వైద్యం అందక జ్వరంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా జ్వరాలు పెరుగుతున్నాయి. ములుగు జిల్లాలో ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం తదితర మండలాల్లోని గిరిజన గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం..

ఐటీడీఎ పరిధిలోని గిరిజన పల్లెల్లో పారిశుద్ధ్య లోపంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అధికారులు, పంచాయితీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుండడంతో పారిశుద్ధ్యం పడకేసింది. వీధుల్లో మురికి గుంతలు, చెత్తా చెదారం ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయి ఉండడంతో రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి.

ముందస్తు చర్యలు కరువు..

సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. మలేరియా ప్రభావిత గిరిజన గ్రామాల్లో దోమల మందు పిచికారి చేయాల్సిన అధికారులు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తూ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తున్నాయి. దీనికితోడు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో పరిస్థితి మరింత దిగజారి పోతోంది. గుట్టలపై నివసించే గిరిజనుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. విషజ్వరాలు విపరీతంగా పెరిగిపోయి మృత్యువాత పడుతున్నారు. ఇందుకు ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed