ఏపీలో పర్యావరణ చట్టం ఉల్లంఘన సిగ్గుచేటు.. ఎన్‌జీటీ తీవ్ర వ్యాఖ్యలు

by  |
ఏపీలో పర్యావరణ చట్టం ఉల్లంఘన సిగ్గుచేటు.. ఎన్‌జీటీ తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదే‌శ్‌లో పర్యావరణ చట్టం ఉల్లంఘన తీవ్రంగా జరుగుతుండటం సిగ్గుచేటని ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ఎన్‌జీటీ ప్రధాన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై కనీసం చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించడమేంటని ప్రశ్నించింది. పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది.

పోలవరం కాఫర్ డ్యామ్‌ వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. మూడేళ్లుగా పోలవరం ముంపుపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి సైతం చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎంతసేపు కేసు ముగించాలనే ఆతృత తప్ప నివేదికలో ఇంకేమీ లేదంటూ అధికారుల తీరుపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు ముగించాలన్న ఆతృత మాత్రమే కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో కనిపించింది. సాయంత్రం పూర్తి తీర్పును ఇవ్వనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అధికారులు ఎవరూ కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలేదని అభిప్రాయపడింది.

Next Story

Most Viewed