మార్కెట్ డిమాండ్ మేరకు పాల ఉత్పత్తి జరగాలి

by  |
మార్కెట్ డిమాండ్ మేరకు పాల ఉత్పత్తి జరగాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నిజాంపేటలోని ప్రభుత్వ సహకార కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల డెయిరీలో భాగంగా 54వ పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిరోజు 80లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటిలో సగభాగం 40లక్షల లీటర్ల పాలు మాత్రమే మార్కెట్‌కు వస్తోందని, మిగతా 40లక్షల లీటర్ల పాలను ఉత్పత్తిదారులు తమ గృహ అవసరాలకు వినియోగించుకుంటున్నారని తెలిపారు. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో భాగంగా రైతులకు ప్రతి లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాలుగా ఇస్తున్నామన్నారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్ మేరకు పాల ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని, అందుకోసం మరిన్ని గేదెలు, ఆవులు పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించారు. ఐసీఎంఆర్ సూచన మేరకు ప్రతి వ్యక్తి రోజుకు 280 ఎం.ఎల్. పాలను తీసుకోవాలి కానీ, తెలంగాణలో 350ఎం.ఎల్. తీసుకుంటున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కరీంనగర్ డైయిరీ ఛైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, హైదరాబాద్ నగర మార్కెటింగ్ ఇంచార్జీలు శ్రీనివాస్, పూర్ణచందర్‌రావు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed