భూ వివాదం.. రోడ్డెక్కిన గ్రామస్తులు

by  |
భూ వివాదం.. రోడ్డెక్కిన గ్రామస్తులు
X

దిశ, నిజామాబాద్ రూరల్: భూ వివాదాలు, వ్యక్తిగత కక్ష్యల కారణంగా గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైకులు, కారును దగ్ధం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామశివారులో మంగళవారం వెలుగుచూసింది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జిల్లా ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కథనం ప్రకారం..సోమవారం డిచ్‌పల్లి శివారులో గల రెయిన్ బో వెంచర్ పక్క స్థలం, ముస్లింలకు చెందిన స్మశాన వాటిక స్థలంపై ఇరువురు యజమానులకు మధ్య వివాదం నెలకొంది. ఈ కారణం వలన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు నడిపల్లి సర్పంచ్ సతీష్, మాజీ ఎంపీటీసీ అన్వర్‌కు చెందిన కారు, ప్రస్తుత వార్డు సభ్యులు సలీం బైకును దగ్ధం చేశారు. ఈ ఘటనలో సర్పంచ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు.

ఇదిలాఉండగా, సందీప్ వర్మ ఆలియాస్ బబ్లు, అతని అనుచరులే ఈ దారుణానికి ఒడిగట్టారని నడిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ, గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన ఏసీపీ శ్రీనివాసరావు రంగంలోకి గ్రామస్తులకు సర్దిచెప్పారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. బబ్లూను కఠినంగా శిక్షించాలని, ఆయనతో సర్పంచుకు ప్రాణహాని ఉందని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

అనంతరం గ్రామస్తులంతా రహదారి పై బైఠాయించి ‘ బబ్లు డౌన్ డౌన్.. వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ సుమారు 3గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటరు మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏసీపీ శ్రీనివాస్ చెప్పిన మాటను గ్రామస్తులు వినకపోవడంతో అదనపు బలగాలు, పోలీసుల సాయంతో నడిపెల్లి గ్రామస్తులను చెదరగొట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Next Story