ఇటువంటి విషయంలో ఆలోచించరా.. ఆ పాపకు తండ్రి అని తెలుసుకోకుండా..!

by  |
ఇటువంటి విషయంలో ఆలోచించరా.. ఆ పాపకు తండ్రి అని తెలుసుకోకుండా..!
X

దిశ, కామారెడ్డి: వరుస కిడ్నాప్ ఘటనలతో ప్రజల్లో పెరిగిన అప్రమత్తత ఓ వ్యక్తిపై దాడికి కారణమైంది. కిడ్నాపర్‌ అనుకొని కన్న తండ్రిపై దాడి చేసిన అమానుష ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి దేవునిపల్లిలో వెలుగుచూసింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో సోమవారం రాత్రి అట్ల బతుకమ్మ సందర్భంగా మహిళలు బతుకమ్మలను కుంటలో నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ ఆటోలో నలుగురు వ్యక్తులు మూడేళ్ళ చిన్నారిని తీసుకుని వెళ్తుండగా.. ఆటో డ్రైవర్‌‌కు అనుమానం రావడంతో ఆటో నిలిపి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు.

దీంతో అక్కడే ఉన్న మహిళలు, గ్రామస్తులు కిడ్నాప్ చేస్తున్నారన్న అనుమానంతో సదరు వ్యక్తులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ చిన్నారి తన కూతురేనని చెప్పిన వినిపించుకోలేదని.. కిడ్నాపర్‌గా భావించిన వ్యక్తి చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. తన కూతురికి స్నానం చేయించడానికి దేవునిపల్లి వచ్చామని పోలీసులకు వివరణ ఇచ్చారు. అయితే ఆ నలుగురు వ్యక్తులు కామారెడ్డి పట్టణంలో కాగితాలు ఏరుకునే వారిగా పోలీసులు గుర్తించారు. చివరకు కన్న తల్లి వచ్చి సదరు వ్యక్తి తన భర్తనే అని చెప్పడంతో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓ వైపు కిడ్నాప్ కథ సుఖాంతం అయిందని గ్రామస్తులు అనుకున్నా.. అమాయకుడైన కన్న తండ్రి దెబ్బలు తినడం పలువురిని బాధించింది. ఇటువంటి విషయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఉండాల్సిందని.. అనవసరంగా అమాయకుడికి దేహశుద్ధి అయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed