దూబే ఎన్‌కౌంటర్.. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏమొచ్చిందంటే..

by  |
దూబే ఎన్‌కౌంటర్.. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏమొచ్చిందంటే..
X

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపేసిన కేసులో ప్రధాన నిందితుడు, 60 కేసులున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే శుక్రవారం ఉదయం పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తలపై రూ.5లక్షల రివార్డు ఉన్న దూబేను మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేసి కాన్పూర్‌కు తరలిస్తుండగా కస్టడీలో నుంచి పారిపోయే యత్నం చేశాడని, పోలీసు తుపాకీ లాక్కుని కాల్పులు జరపగా, ఎదురుకాల్పుల్లో చనిపోయాడని అధికారులు వెల్లడించారు. గతవారం కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అరెస్టు చేయడానికి వెళ్లగా వికాస్ ముఠా కాల్పులు జరిపి డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం వికాస్ దూబే పరారీలో ఉండగా, కనీసం 100 పోలీసు బృందాలు గాలింపులు జరిపాయి.

ఏం జరిగింది?

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మధ్యప్రదేశ్‌లో ఉన్నట్టు సమాచారమందగా, ఉత్తరప్రదేశ్ నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ సహా కాన్పూర్ పోలీసు బృందం ఉజ్జయినికి చేరింది. వికాస్ దూబేను గురువారం అరెస్టు చేసి కాన్పూర్ తరలిస్తుండగా శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కాన్పూర్‌కు సమీపంలోని సచేందికి చేరగానే ఉదయం ఏడుగంటలకు వికాస్ దూబే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడిందని కాన్పూర్‌కు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ఇదే అదునుగా భావించిన వికాస్ దూబే పక్కనే ఉన్న ఓ అధికారి నుంచి సర్వీస్ తుపాకీ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలోపే ఆ కారును అనుసరిస్తున్న ఇతర కార్లలోని పోలీసులు దిగి ఆ ఏరియాలో ఘెరావ్ చేశారు. వికాస్ దూబే తప్పించుకోనివ్వకుండా అడ్డుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో దూబే కాల్పులకు తెగబడ్డాడు. లొంగిపోవాల్సిందిగా ఆదేశాలిచ్చినా కాల్పులు జరిపాడు. అతని కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడగా, పోలీసులూ ఎదురుకాల్పులు జరిపారు. అనంతరం గాయపడిన ముగ్గురినీ హాస్పిటల్‌కు తరలించగా, వికాస్ దూబే అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పినట్టు కుమార్ వివరించారు.

నాలుగు బుల్లెట్లు: పోస్టుమార్టం రిపోర్టు

ఈ ఘటనలో గాయపడ్డ పోలీసుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఎల్ఎల్ఆర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్‌బి కమల్ తెలిపారు. కాగా, వికాస్ దూబేకు ఛాతిలో మూడు బుల్లెట్లు దిగాయని, చేతికి ఒక తూటా గాయం ఉన్నదని పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో వెల్లడించారు.

ఎన్‌కౌంటరా? హత్యా?

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ఎదురుకాల్పుల్లో చనిపోయాడా? లేక పోలీసులే చట్టవిరుద్ధంగా హత్యకు పాల్పడ్డారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలను సంధిస్తున్నారు.
* ఓ టోల్ ప్లాజా ప్రకారం, వికాస్ దూబే ప్రయాణిస్తున్న కారు వేరు, పల్టీ కొట్టిన కారు వేరుగా తేలింది. ఒకవేళ కారే మార్చితే ఎందుకు మార్చాల్సి వచ్చింది?
* ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌కు రెండు కిలోమీటర్ల వెలుపలే మీడియాను ఎందుకు ఆపేశారు?
* కరుడుగట్టిన నేరస్తుడిని అరెస్టు చేసి బేడీలు వేయలేదా? * వేసి ఉంటే పక్కనే ఉన్న పోలీసు అధికారి దగ్గర నుంచి తుపాకీ లాక్కుని బోల్తాపడిన కారు నుంచి పారిపోయే అవకాశం చిక్కిందా?
* ఈ ఎన్‌కౌంటర్‌కు ఒక్కరోజు ముందే వికాస్ దూబే ప్రధాన అనుచరుడు ప్రభాత్ మిశ్రా కూడా ఇదే తరహా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతన్ని కూడా అరెస్టు చేసి కాన్పూర్‌కు తరలిస్తుండగా పోలీసుల తుపాకీ లాక్కుని కాల్పులు జరిపే యత్నం చేశాడని, అనంతరం పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయాడని యూపీ పోలీసులు తెలిపారు.
* అలాంటప్పుడు పోలీసులు తుపాకులను మరింత భద్రంగా ఎందుకు ఉంచుకోలేదు?
* గురువారం వికాస్ దూబేను మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేస్తుండగా.. ‘నేను కాన్పూర్‌కు చెందిన వికాస్ దూబే’ అంటూ ఆ గ్యాంగ్‌స్టర్ అరిచాడు. తాను సరెండర్ అవుతున్నదానికి చిహ్నంగా ఈ అరుపును అభిప్రాయపడుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం అతను సరెండర్ కాలేదు. పట్టుకోబడ్డాడు అనే తీరుగానే వ్యవహరించారు. అలాంటప్పుడు ఒక్కరోజు వ్యవధిలోనే కాన్పూర్ పరిసరాల్లోకి చేరగానే మళ్లీ పారిపోయే ప్రయత్నం ఎందుకు చేస్తాడు?
* కారు పల్టీకొట్టిన ప్రాంతం దగ్గరా అసలు రోడ్డుపై బ్యారియర్ లేదు. అంతేకాదు, పక్కనే పంటపొలాల్లోకి వెళ్లే పిల్లదారి ఉన్నది.
* తాము బుల్లెట్ల చప్పుడు మాత్రమే విన్నామని కొందరు సాక్షులు చెబుతుండగా, యాక్సిడెంట్ గురించి నామమాత్రంగానైనా మాట్లడలేదు.



Next Story

Most Viewed