టీఆర్‌ఎస్ అనూహ్య నిర్ణయం.. విజయగర్జన సభ వాయిదా

by  |
KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ విజయగర్జన సభ వాయిదా పడింది. ఈ నెల 29న నిర్వహించాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. కేసీఆర్ ప్రారంభించిన దీక్షా దివస్ రోజు ఈ నెల 29న కావడంతో ఆ రోజున నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ రోజున నిర్వహించేందుకు కేసీఆర్ సముఖత వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ లో సోమవారం సీఎం కేసీఆర్ ను ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కలిశారు. ఈ నెల 15న తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని కేసీఆర్ ను కోరారు.

నాటి ఉద్యమ రథసారథిగా ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ’ అనే నినాదంతో నవంబర్ 29న దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షా దివస్ రోజున తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. తేదీ మార్పును పార్టీ శ్రేణులకు తెలియజేయాలని సూచించారు. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను ఈ నెల 29కి మార్చుకోవాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed