ప్రభుత్వ పెద్దలే కబ్జా చేస్తున్నారు.. శేరిలింగంపల్లిలో రోడ్డెక్కిన బాధితులు

by  |
ప్రభుత్వ పెద్దలే కబ్జా చేస్తున్నారు.. శేరిలింగంపల్లిలో రోడ్డెక్కిన బాధితులు
X

దిశ, శేరిలింగంపల్లి: ప్రభుత్వ పెద్దలే కబ్జాలు చేస్తున్నారంటూ బాధితులు రోడ్డెక్కారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని రంగనాథ్‌నగర్ సర్వే నెంబర్ 163, 165, 167, 169, 277, 276, 278, 279, 281లలో ఉన్న తమ ప్లాట్లలో కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిని వెంటనే అడ్డుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వానికి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పేదల భూములను ప్రభుత్వ పెద్దలే లాక్కుంటున్నారని బాధితులు ఆరోపించారు.

గచ్చిబౌలి డివిజన్ రంగనాథ్‌నగర్‌లో 1985లో ఓ ప్రైవేట్ వ్యక్తి వేసిన వెంచర్‌లో సుమారు 1428 ప్లాట్లు కొన్నామని, అయితే ఈ భూమి తమదే అంటూ గత నెల 30న కొందరు వ్యక్తులు.. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల సహాయంతో తమపై దాడి చేసి ఇళ్లను కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ప్లాట్లు కొనుకున్న వారు కొందరు ఇల్లు కట్టుకున్నారని, అయితే ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అంటూ భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు.

జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడంతో ఇళ్లల్లో ఉన్నవారు రోడ్డున పడ్డారని వాపోయారు. తాము కొన్న ప్లాట్లల్లో ఇల్లు కట్టుకుంటే వాటిని కూల్చివేయడం దారుణమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై శేరిలింగంపల్లి జడ్పీని కలిస్తే విచారణ చేపిస్తామని చెబుతున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ప్రకాష్ రెడ్డి, మంగ శ్రీనివాస్, రాఘవేందర్ రావు, మహేష్, శ్రీనివాస్, మహ్మద్ హుస్సేన్, పద్మావతితో పాటు బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story

Most Viewed