ఈటలకు మరో షాక్.. ఇక ఉపసర్పంచ్, వార్డు సభ్యుల వంతు..!

by  |
trs-joining
X

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటిదాకా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఆ పార్టీలోనే కొనసాగుతామని తెలుపగా.. ఇప్పుడు తాజాగా ఉప సర్పంచులు సైతం టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామంటూ అందులో చేరిపోతున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులంతా ఆయనకు మద్దతుగా, బాసటగా నిలిచారు. తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ వైపు క్యూ కట్టారు.

గత కొద్ది నెలలుగా టీఆర్ఎస్ పార్టీలోకి ప్రజాప్రతినిధులతో పాటు, ద్వితీయ శ్రేణి నాయకులు చేరారు. నిన్న, మొన్నటి దాకా ఈటల వెంట ఉన్న కొందరు నేతలు కూడా క్రమక్రమంగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోతున్నారు. ప్రస్తుతం వారి బాటలో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కూడా గులాబీ గూటికి చేరుతున్నారు. ఈ చేరికల వల్ల ప్రజల్లో ప్రతినిత్యం చర్చ కొనసాగుతోంది. కాగా, శనివారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామ ఉపసర్పంచ్, ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మండల ఇన్చార్జి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు సమక్షంలో సుమారు 20 మంది టీఆర్ఎస్‌లో చేరారు.

Next Story