వాజ్‌పేయి జీవితాన్ని యువత అధ్యయనం చేయాలి: ఉపరాష్ట్రపతి

by  |
వాజ్‌పేయి జీవితాన్ని యువత అధ్యయనం చేయాలి: ఉపరాష్ట్రపతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా జీవితంలో ఉన్నవారిలో నైతికత.. విలువల పతనంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ‘ప్రజాస్వామ్య ఏకాభిప్రాయ నిర్మాణం – వాజ్‌పేయి మార్గం’ అనే అంశంపై ‘ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ, కార్యకర్తలు.. పార్టీ తరపున ఎన్నికైన సభ్యులు ప్రతి అడుగులోనూ నైతికంగా జీవించేలా చొరవ తీసుకోవాలన్నారు. అధికారం కోసం అంగబలాన్ని, అర్థబలాన్ని దుర్వినియోగం చేస్తూ ఓ సిద్ధాంతమనేది లేకుండా రాజకీయాలు సాగుతుండటం మంచిది కాదన్నారు. నేరప్రవృత్తి వారు పాలిటిక్స్‌లోకి రావడం వల్ల హింస పెరుగుతోందని, ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలన్నారు. ‘సౌకర్యవంతమైన రాజకీయాలు’ అనే విధానానికి స్వస్తి పలికి అటల్ జీ చూపించిన ‘విశ్వాస వంతమైన రాజకీయాలు’ను, ‘రాజకీయ ఏకాభిప్రాయం’ నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.

రాజనీతిజ్ఞుడైన వాజ్‌పేయి జీవితాన్ని నేటి యువత, రాజకీయాల్లోకి రావాలనుకునే వారు అధ్యయనం చేయాలన్నారు. అవినీతి, వర్ణ, లింగ, కుల వివక్ష, మహిళలపై హింసతోపాటు పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణల్లోనూ అటల్ జీ తీసుకొచ్చిన మార్పులను ప్రస్తావించారు. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, ఎఫ్ఆర్బీఎమ్ చట్టాన్ని తీసుకురావడం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు, విద్యుత్ రంగంలో సంస్కరణలు, అనుసంధానత పెంచడం, ఉచిత ప్రాథమిక విద్యను అందించడం వంటివి వారి సంస్కరణాభిలాష, దూరదృష్టికి మచ్చుతునకలన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాలకు సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణం, సమాచార మౌలికవసతులను ప్రోత్సహించడం ఓ అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగతి మంత్రమైన ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ను ప్రస్తావించారు. కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు వైస్ అడ్మిరల్ శేఖర్ సిన్హా, ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ సభ్యుడు శౌర్య దోవల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు రాంమాధవ్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed