విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఉద్యమంపై వీహెచ్ కామెంట్స్

by  |
విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఉద్యమంపై వీహెచ్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నరేంద్ర మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే లక్షంగా పెట్టుకుందని, ప్రజా శ్రేయస్సు దృష్య్టా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన అవసరముందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నామని చేసిన కామెంట్స్‌పై ఆయన మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరముందన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థలను రక్షించుకోలేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణలో ప్రధాని మోడీ వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు. పబ్లిక్ సెక్టార్స్‌ను కాపాడాల్సిన ప్రధాని.. వాటిని అమ్మేందుకు అదానీ, అంబానీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. అందుకే ఆదానీ, అంబానీల చేతిలో మోడీ కీలుబొమ్మగా మారి వారు చెప్పినట్లు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఒక్కసారి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని నిర్ణయించాక.. దేశంలోని మిగతా సంస్థలను కూడా అమ్మడం మొదలు పెడుతారన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ భూములకు కోట్ల రూపాయల విలువ ఉంటుందని, అలాంటి భూములను కాపాడాల్సింది పోయి.. అమ్మడమేంటని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములను అమ్మేస్తున్నట్లే.. రేపు బిహెచ్‌ఈఎల్‌, ఈసీఎల్‌లనూ అమ్మేస్తారని విమర్శించారు. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాలను కల్పిస్తూ.. రిజర్వేషన్లను అమలు చేస్తున్న ఇలాంటి సంస్థలు పోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించాలన్నారు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ప్రజలందరూ సమాయత్తం కావాలని.. మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలన్నారు.

Next Story

Most Viewed