దేశ సాంస్కృతిక పండుగగా బోనాలు.. కిషన్ రెడ్డికి వినతి

by  |
దేశ సాంస్కృతిక పండుగగా బోనాలు.. కిషన్ రెడ్డికి వినతి
X

దిశ, చార్మినార్​: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగను దేశ సాంస్కృతిక పండుగగా ప్రకటించాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ చైర్మన్ కె.వెంకటేష్ బృందం విజ్ఞప్తి చేసింది. మంగళవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆలయ చైర్మన్ కె.వెంకటేష్, ఉపాధ్యక్షుడు సీరా రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి.మారుతి యాదవ్, కోశాధికారి జి. అరవింద్ కుమార్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎ. చంద్ర కుమార్ తదితరులు ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రతి ఏడాది ఆషాఢమాసంలో యావత్​ తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే బోనాల పండుగను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్​ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం బోనాల పండుగను భారతదేశ సాంస్కృతిక పండుగగా ప్రకటించి బోనాల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతిని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చాటి చెప్పాలని కోరారు. ఢిల్లీలో బుధవారం జరిగే బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని కిషన్ రెడ్డిని ఆహ్వానించారు.

Next Story

Most Viewed