తన మూత్రం తానే తాగి పిల్లలకు పాలు ఇచ్చిన తల్లి, ఆ తర్వాత..

by  |
తన మూత్రం తానే తాగి పిల్లలకు పాలు ఇచ్చిన తల్లి, ఆ తర్వాత..
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లి గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతోంది. తల్లిని మించిన దైవం లేదు.. అసలు తల్లే లేకపోతే ఈ సృష్టే లేదు. ఆమె చేసిన త్యాగాలు వర్ణించలేనివి.. ఆమె పడిన కష్టాలు ఊహకు అందనివి. కన్న బిడ్డల కోసం, కట్టుకొన్న భర్త కోసం ఎన్నో త్యాగాలను చేసిన మహిళలను చూసే ఉంటాం. ఇక తల్లి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిడ్డల ఆకలి తీర్చడానికి ఎంతటి సాహసానికైనా పూనుకొంటుంది. అది తన మరణమైనా సంతోషంగా మృత్యుఒడిలోకి జారుకొంటుంది. తాజాగా ఓ తల్లి కూడా తన బిడ్డలా ఆకలి కోసం ఒక సాహసానికి పూనుకొని మృత్యుఒడికి చేరింది. ప్రస్తుతం ఆమె కథ నెట్టింట వైరల్ గా మారింది.

వివరాలలోకి వెళితే.. వెనిజులా ప్రాంతానికి చెందిన మార్లేస్‌ బీట్రిజ్‌ చాకోన్‌ మర్రోక్విన్‌(40) తన భర్త, ఇద్దరు పిల్లలతో పాటు పనిమనిషితో కలిసి సరదా ట్రిప్‌ కోసం వెనిజులా టూరిస్ట్‌ క్రూజ్‌ బోట్‌ ఎక్కారు. సెప్టెంబర్ 3న బయల్దేరినఈ నౌక వెనిజులా నుంచి టోర్టుగాకు బయలుదేరింది. బయల్దేరిన రెండురోజులకే భారీ అలల కారణంగా మొదట పాడైన బోటు.. ఆ తర్వాత అలల ధాటికి రెండు ముక్కలయింది. ఈ ప్రమాదంలో చాకోన్‌ భర్త నీటిలో మునిగిపోగా ఇద్దరు పిల్లలతో చాకోన్, ఆమె పనిమనిషి వెరోనికా శిథిలాలను పట్టుకొని బతికి బట్టకట్టారు. ఇలా మూడు రోజులు ఆయా నౌక ముక్క నీటిలో తెలియాడుతూనే ఉంది.

తన ఇద్దరు బిడ్డల్ని(ఒకరికి రెండేళ్లు, ఒకరికి ఆరేళ్లు) డీహైడ్రేషన్‌, అలల నుంచి కాపాడుకునేందుకు మార్లేస్‌ వీలైనంత ప్రయత్నం చేసింది. అప్పటికే రోజులు గడవడం.. ఆహారం, నీరు లేకపోవడంతో వారి శరీరాలు డీహైడ్రేషన్ చెందడం ప్రారంభమైంది. దీంతో తాను చనిపోయినా బిడ్డలు బ్రతకాలని కోరుకోంది.

పిల్లలకు పాలు పట్టడానికి ఎవరు చేయలేని సాహసం చేసింది. తన మూత్రాన్ని తానే తాగి ఆకలి తీర్చుకొని బిడ్డలకు పాలు పట్టింది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదనుకుని.. బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్‌ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచింది.

ఇక సముద్ర తీరంలో నౌక ప్రమాదం జరిగిందని తెలుసుకున్న అధికారులు హుటాహుటిన రెస్క్యూ టీం తో సంఘటనా స్థలానికి వెళ్లగా.. తల్లి మృతదేహాన్ని ఆనుకొని ఇద్దరు బిడ్డలు బిక్కుబిక్కుమంటూ ఉండడం చూసి అధికారులు చలించిపోయారు. ప్రస్తుతం వారిని కారాకస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పక్కనే వెరోనికా కూడా ఐస్ బాక్స్ లో దాక్కొని ప్రాణాలను దక్కించుకొంది. అయితే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునే నాలుగు గంటల ముందే మార్లేస్‌ మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న మార్లేస్‌ అంత్యక్రియలు నిర్వహించారు. బిడ్డలు కోసం ఆ తల్లి చేసిన త్యాగానికి ప్రతిఒక్కరు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తల్లిప్రేమ ఇలాగే ఉంటుంది అంటూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

Next Story

Most Viewed