వేదాంత ప్లాంట్ రీఓపెన్

by  |
వేదాంత ప్లాంట్ రీఓపెన్
X

చెన్నై: సుమారు మూడేళ్ల క్రితం మూతపడ్డ తమిళనాడులోని తూతుక్కుడిలో ఉన్న స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానున్నది. వేదాంత సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్లాంట్‌ను నాలుగు నెలల పాటు తెరవాలని తమిళనాడు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం దీనిని తెరుస్తు్న్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక జనం ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్లాంట్‌ను రీఓపెన్ చేయనున్నారు. అయితే ఇందులో ఆక్సిజన్ మినహా రాగి ఉత్పత్తి చేపట్టరాదని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం తెలిపింది.

ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓ కమిటీ దీనిని పర్యవేక్షించనుంది. ఇదే విషయమై సోమవారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్.. దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించింది. కాగా, 2018లో స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా స్థానికులు పెద్దఎత్తున‌ ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిపిన పోలీసుల కాల్పుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను మూసేసింది. ప్లాంట్‌ను తెరువాల‌న్న వేదాంత సంస్థ అభ్యర్థనలను మ‌ద్రాస్ హైకోర్టు, గతేడాది సుప్రీంకోర్టు నిరాకరించాయి.

Next Story

Most Viewed