కరోనా ఎఫెక్ట్: సౌదీలో వ్యాట్ భారీగా పెంపు

by  |
కరోనా ఎఫెక్ట్: సౌదీలో వ్యాట్ భారీగా పెంపు
X

కరోనా రక్కసి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను మూడింతలు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు చెల్లించే జీవన భృతిని కూడా నిలిపివేస్తున్నట్లు సౌదీ ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్- జాదాన్ మీడియాకు వెల్లడించారు.

‘‘వ్యాట్ 5 నుంచి 15 శాతానికి పెంచబోతున్నాం. ఇది జూలై నుంచి అమల్లోకి రానుంది. ఇక ప్రజలకు ఇచ్చే జీవన భృతిని జూన్ నుంచి నిలిపివేయనున్నాం.’’ అని ఆర్థిక మంత్రి జాదాన్ అక్కడి అధికారిక మీడియా సౌదీ ప్రెస్ ఏజెన్సీకి తెలిపారు. ఒకవైపు కరోనా వైరస్ విజృంభణ, మరోవైపు చమురు ధరల పతనంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. దీంతో ఆర్థిక రంగాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని జాదాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే చమురు ధరలు మూడింట రెండు వంతుల తగ్గినందునా, చమురు ఉత్పత్తుల అమ్మకం ద్వారా దేశానికి వచ్చే ఆదాయంలో సగం కోల్పోయామని మంత్రి తెలిపారు. ఇప్పటికే సౌదీ అరేబియా అదనపు ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా 2018లో వస్తుసేవలపై 5 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed